ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ప్రధానితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే బీజేపీయేతర ముఖ్యమంత్రులను అవమానపరుస్తున్నారు. తొలుత హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడాను ఆ తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ను హేళన చేశారు. ఈ సంఘటనలు మంగళవారం చోటు చేసుకున్నాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు సంస్కారహీనులని, సభామర్యాదలు తెలియవంటూ బాధిత సీఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ సమక్షంలోనే బీజేపీ కార్యకర్తల హేళనను ఎదుర్కొన్న వీరిద్దరు ఇకపై తాము ప్రధాని పాల్గొనే సమావేశాల్లో పాల్గొనబోమని తెగేసి చెప్పారు. మరోవైపు బీజేపీ కార్యకర్తల ప్రవర్తనకు భయపడి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రథ్వీరాజ్ చవాన్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే కార్యక్రమానికి ఏకంగా డుమ్మానే కొట్టారు. నాగ్పూర్లో ప్రధాని పాల్గొన్న మెట్రో ప్రాజెక్ట్ శంకుస్థాపనకు గైర్హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరు కావాలని స్వయంగా బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఫోన్ చేసినా చవాన్ సారీ చెప్పారు. బీజేపీ కార్యకర్తల చేతిలో అవమానం పాలు కావడం ఇష్టం లేకే చవాన్ ముఖం చాటేసినట్లు తెలుస్తోంది.