తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తూ తనకు వ్యక్తిగతంగా తనకు లేఖలు రాసిన సినీ నటుడు రజనీకాంత్, కేంద్ర మంత్రి మేనక గాంధీలకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ధన్యవాదాలు తెలిపారు. అక్రమాస్తుల కేసులో జైలుపాలై, సుప్రీంకోర్టు బెయిల్తో బయటికొచ్చిన ఈ మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఎందరో బాహాటంగానే మద్దతిస్తున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్రమంత్రి మేనకాగాంధీ ఆదివారం నాడు జయకు లేఖలు రాశారు. ఆమెకు మద్దతిస్తున్నట్టు తమ లేఖల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, రజనీకాంత్, మేనకలకు జయ 'థాంక్స్' చెప్పారు. ఈ మేరకు లేఖలు రాశారు. కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉండి కూడా నా గురించి ఆలోచించడం నన్ను కదిలించివేసింది. మీ ఉత్తరం నా మనసు లోతులను తాకింది అంటూ మేనకకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, రజనీకాంత్కు రాసిన లేఖలో మీ ఉత్తరం చూసి ఎంతో సంతోషించాను. అందులో మీరు వ్యక్తం చేసిన సానుభూతికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మీ కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు అని జయలలిత తన ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు.