హిమాచల్ప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్లా నుంచి 30 మందికిపైగా ప్రయాణికులతో సవేరాఖుడ్కు వెళ్తున్న హిమాచల్ ఆర్టీసీ బస్సు కతార్ఘాట్ వద్ద అదుపుతప్పి లోయలో పడింది. బసంత్పూర్-కింగాల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 20 మంది మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ బస్సులోంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సహాయ చర్యలను చేపట్టారు. మరోవైపు ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ సహాయక చర్యలను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.
ఇకపోతే.. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అదుపు తప్పిన ఓ కంటెయినర్ రోడ్డు పక్కన నిద్రిస్తున్న భక్తులపై దూసుకెళ్లడంతో 12 మంది మృతిచెందారు. మరో 22 మంది గాయపడ్డారు.