ఇప్పటికిపుడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినట్టయితే నరేంద్ర మోడీ ప్రభావం కారణంగా బీజేపీ సులభంగా గెలుపొందుతుందని, అదేసమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు గడ్డు పరిస్థితులు ఎదురుకాక తప్పవని తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ తేటతెల్లం చేశాయి. అదేసమయంలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీలు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని 'ఏబీపీ న్యూస్-నీల్సన్' జరిపిన సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పేర్కొంటున్నాయి.
ఇప్పటికిపుడు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహిస్తే, 70 సీట్లకుగానూ కమలం 46 సీట్లు దక్కించుకుంటుందని వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 18, కాంగ్రెస్ 5 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే వివరించింది. అంటే బీజేపీ 38 శాతం, ఏఏపీ 26 శాతం, కాంగ్రెస్ 22 శాతం ఓట్లను పంచుకుంటాయని పేర్కొంది.
ఇకపోతే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్కు 39 శాతం మంది ప్రజలు మొగ్గు చూపగా, బీజేపీ నేత, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్కు 38 శాతం మంది, కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ సీఎం షీలా దీక్షిత్కు 7 శాతం మంది మద్దతు తెలిపినట్టు పేర్కొంది.