పార్లమెంట్లో నల్లధనం అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష పార్టీలు మంగళవారం ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు కల్పించుకుని పార్లమెంట్ ఉభయ సభల్లో నల్లధనంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వదా సిద్ధంగా ఉందని, ఇందుకోసం ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.
ఆ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత సభలో విపక్షాలు మరోమారు ఆందోళనకు దిగాయి. దీంతో స్పందించిన వెంకయ్యనాయుడు విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అంతేకాక, చర్చ ఎక్కడ జరిగినా, స్పీకర్ ఎప్పుడు అనుమతిచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, నల్లధనంపై చర్చకు వెనుకాడే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు.