కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పీచమణిచేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ఆయనపై గతంలో వచ్చిన అనేక అవినీతి ఆరోపణల కేసులను తిరగదోడాలని భావిస్తోంది.
ముఖ్యంగా నల్లధన కుబేరుల జాబితాలో రాబర్ట్ వాద్రా పేరు ఉన్నట్టు జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఖాతా విషయంలో ఆయనపై కేసు నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు సమాచారం.
బ్లాక్ మనీ దాచుకున్న వారి జాబితాను త్వరలో కోర్టు ముందు ఉంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ జాబితాలో రాబర్ట్ వాద్రా పేరుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పేర్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ ఖండించక పోవడంతో ఈ వార్తలు నిజమని తెలుస్తోంది.
మరోవైపు.. బీజేపీకి దమ్ముంటే ఆ నల్లధన కుబేరుల జాబితాను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ సవాల్ విసిరింది. ఇదే విషయంపై ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి అజయ్ మకేన్ బుధవారం మీడియా ముఖంగా డిమాండ్ చేశారు.