పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశల ప్రారంభం రోజునే ఉత్తరాఖండ్ అంశం రాజ్యసభను కుదిపేసింది. ఈ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే, ఉత్తరాఖండ్ అంశం కోర్టులో ఉన్నందున దానిపై చర్చించడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది.
కోర్టులో ఉన్న అంశంపై చర్చించడం సబ్ జ్యుడిస్ అవుతుందంటూ ప్రభుత్వం తిరస్కరించడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సమావేశాల్లో మొదటి రోజంతా ఉత్తరాఖండ్ అంశంపైనే దృష్టి కేంద్రీకరిస్తామని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. రాజ్య సభలో విపక్షాల సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభను ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.
బడ్జెట్ సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఉత్తరాఖండ్ అంశంపై తమ నిరసన వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకొచ్చారు. దీంతో ఛైర్మెన్ హమీద్ అన్సారీ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా ఇదే పరిస్థితి నెలకొనడంతో మళ్లీ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు.