వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ పరిధిలోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో జూనియర్ విద్యర్థినికి ర్యాగింగ్ పేరిట లైంగిక వేధింపులకు గురి చేసిన ముగ్గురు సీనియర్ విద్యార్థులపై యూనివర్శిటీ అధికారులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. ఈ ముగ్గురు కీచక విద్యార్థులను సస్పెండ్ చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు కీచక విద్యార్థులను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఈ వర్శిటీలో కొత్తగా చేరిన ఓ జూనియర్ విద్యార్థినిని ర్యాగింగ్ పేరిట తమ వద్దకు పిలిపించుకుని ముగ్గురు సీనియర్ విద్యార్థులు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, దుస్తులు విప్పదీయించి, నగ్నంగా ఫొటోలు తీశారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు రూ.4 వేలను డిమాండ్ చేశారు. డబ్బులివ్వకపోతే నగ్న ఫొటోలను నెట్లో పెడతామంటూ బెదిరించారు.
దీనిపై పక్షం రోజులుగా తర్జనభర్జన పడిన బాధిత విద్యార్థిని తండ్రి ధైర్యం చేయడంతో ముందుకు వచ్చి వర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై తక్షణం స్పందించాల్సిన వర్శిటీ అధికారులు.. మీనమేషాలు లెక్కిస్తూ.. బాధిత విద్యార్థినిని అవమానపరిచేలా నడుచుకున్నారు. ఈ వ్యవహారం శనివారం దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనమైంది.
దీంతో స్పందించక తప్పని అధికారులు, ముగ్గురు సీనియర్ విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వర్సిటీలో అంతర్గత విచారణ నిర్వహించిన తర్వాత కీచక విద్యార్థులపై తదుపరి చర్యలు తీసుకుంటామని వైస్ ఛాన్సలర్ ప్రతినిధి వెల్లడించారు.