అమెరికాలోని డేలావేర రాష్ట్రంలోని హిందూ దేవస్థానంలో ఇటీవల గురుపౌర్ణమి రోజున శిరిడి సాయికి వైభవంగా వేడుకలు జరిగాయి. డేలావేర రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మహాలక్ష్మి దేవస్థానంలో జరిగిన శిరిడీసాయి పూజలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. దాదాపు 200 మంది దాక భక్తులు వేడుకలకు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ పాటిబండ్ల శర్మగారు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం రావు రాయవరపు మరియు సుచిత్ర ఆధ్వర్యంలో జరిగిన బాబా భజనలకు భక్తులు భక్తి పారవశ్యంలో పులకరించిపోయారు. గురుపౌర్ణమి ఆ శిరిడీ సాయినాథునికి అత్యంత ప్రియమైన రోజనీ, తను మహాసమాధి చెందుతూ ఆరోజు తనని పూజించమని చెప్పిన రోజనీ, ఆ రోజు పూజించి గురువుగా స్వీకరించినవారిని జన్మజన్మలకి ఆయన ఆశీస్సులు అందజేస్తారని ఆలయ పూజారి తెలిపారు.
అనతరం బాబా ఆరతులు, అభిషేకం, బాబా రథయాత్ర జరిగాయి. ఆ తర్వాత పదకొండు రకాల నైవేద్యాలతో మహాప్రసాదం పంచిపెట్టారు. బాబా భక్తుల నుండి ప్రతివారం భజనలు జరపడానికి అభ్యర్థనలు వస్తున్నాయనీ, భక్తుల కోరిక మేరకు ప్రతివారం భజనలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు ఆనంద్ మన్నెం, శ్రీరాం, బిందు, రవి తదితరులు తెలిపారు.