దండకారణ్యం అనే మాటను మన పురాణాల్లో విని వుంటాం.. చదివి ఉంటాం. ఈ అరణ్యానికి ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. దాండక్యుడు అనే రాజు ఉండేవాడు. ఈయన భోజవంశానికి చెందిన రాజు. అతికాముకుడు. అందమైన స్త్రీ తారసపడితే ఆమెను అనుభవించే వరకు నిద్రపోడు. అంతటి తత్త్వం దాండ్యకుడిది.
ఒక రోజున రాజు అడవికి వేటకు వెళ్లాడు. అక్కడ ఆయన కంటికి ఓ ఆశ్రమం కనిపించింది. అది భార్గవ మహర్షిది. అప్పటికే బాగా అలసి ఉన్న దాండక్యుడు సేదతీరడం కోసం ఆశ్రమంలోకి అడుగు పెట్టాడు. లోపల మహర్షి లేడు. ఆయన కుమార్తె మాత్రమే ఉంది. చిన్న వయస్సు. చూడచక్కగా ఉంది.
పెళ్ళీడుకు అప్పుడప్పుడే వచ్చినట్టు కనిపిస్తోంది. ఒళ్ళంతా అదోలాంటి కాంతి, ఆ ముని కన్యను చూడగానే దాండక్యుడికి మతిపోయింది. కామేచ్ఛ ఎగచిమ్మిది. ఉన్నఫళాన ఆమెను బలవంతంగా ఎత్తి పట్టుకుని తన రథంపైన ఎక్కించుకుని వెళ్ళిపోయాడు.
దర్పలు, సమిధుల కోసం వెళ్ళిన భార్గవ మహర్షి కొంతసేపటికి ఆశ్రమానికి చేరుకున్నాడు. కుమార్తె కనిపించలేదు. పరిసరాలు వెదికాడు. ప్రయోజనం లేదు. చివరికి దివ్యదృష్టి సారించాడు. విషయం అర్థమైంది. ఆగ్రహోదగ్రుడయ్యాడు. బంధుమిత్ర సపరివార సమేతంగా నశించిపొమ్మని దాండక్యుడిని శపించాడు. అలా దాండక్యుడు అంతరించిపోయిన ప్రదేశమే ఇప్పటి దండకారణ్యం.