యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లలకు గొంతులో కిచ్ కిచ్ ఏర్పడితే యాలకులు ఉడికించిన గోరు వెచ్చని నీరు రెండు స్పూన్లు ఇస్తే సరిపోతుందని వారు సూచిస్తున్నారు.
ఇంకా వాంతులు అయినప్పుడు అరలీటరు నీటిలో ఐదు గ్రాముల యాలకలను వేసి ఉడకబెట్టండి. బాగా కాగిన తర్వాత నీరు 1/4వ వంతు వచ్చినప్పుడు తీసి ఆ నీటిని సేవిస్తే వాంతులు తగ్గి, శరీరంలోని నీరసం తగ్గుతుంది. దీంతో మంచి ఉపశమనం లభిస్తుంది.
గొంతులో కిచ్ కిచ్: దగ్గుతో ఇబ్బంది పడి గొంతులో (కిచ్ కిచ్) మంట, బొంగురు పోయినట్లుంటే ఉదయం లేవగానే యాలకలను నమిలి తినండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగండి. ఉపశమనం కలుగుతుంది.
వాపు : గొంతులో వాపు సంభవిస్తే ముల్లంగిని నానబెట్టిన నీటిలో యాలకలను రుబ్బి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
దగ్గు : వర్షాకాలంలో జలుబు, దగ్గు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా ఉన్నప్పుడు యాలకలు, అల్లం ముక్క, లవంగం, ఐదు తులసి ఆకులు కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
నోట్లో పొక్కులుంటే : నోట్లో పొక్కులుంటే యాలకలతోపాటు కలకండను కలిపి పేస్ట్లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని నాలుకపై ఉంచుకోండి. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.