ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారులో చక్రం తిప్పుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి పెద్ద కష్టమొచ్చింది. తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అదీ ఓ విమానయాన కంపెనీ చేసి నిర్వాకం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వెంకయ్య ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే. ఈ పర్యటనలోనే ఆయన ఈ కష్టాలు ఎందుకు పడ్డారో తెలుసుకుందాం.
ఫ్రాన్స్లోని బోర్డెక్స్ నగరంలో జరిగిన 22వ అంతర్జాతీయ ఇంటలిజెంట్ ట్రాన్స్పోర్ట్సిస్టమ్ వరల్డ్ కాంగ్రెస్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్కు ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే, ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఆయన కోసం రిజర్వు చేసిన టికెట్ను ఎయిర్ ఫ్రాన్స్ అధికారులు రద్దు చేశారు. దీంతో ఆయన దాదాపు 600 కిలో మీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీ వర్షంలో దాదాపు 600 కిలో మీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి బోర్డెక్స్లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంఘటనపై ఫ్రాన్స్ రవాణా మంత్రి అలెస్ స్పందించి వెంకయ్యకు క్షమాపణ చెప్పారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా వెల్లండించారు.