ఐర్లాండ్లో ఆరేళ్ల బాలికపై జాత్యహంకార దాడి జరిగింది. కేరళలోని కొట్టాయంకు చెందిన ఆరేళ్ల బాలిక నియా ఆగ్నేయ ఐర్లాండ్లోని వాటర్ఫోర్డ్ నగరంలో తన ఇంటి బయట ఆడుకుంటుండగా, 12 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లల ముఠా ఆమెపై దాడి చేసింది. ఆ బాలికను డర్టీ అని పిలువడమే కాకుండా "భారతదేశానికి తిరిగి వెళ్ళు" అంటూ హేళన చేసారు.
నియా తల్లి అనుపా అచ్యుతన్ మీడియాతో మాట్లాడుతూ, ఆ ముఠా తన కుమార్తె ముఖంపై కొట్టి, ఆమె ప్రైవేట్ భాగాలను సైకిల్తో ఢీకొట్టి, మెడపై కొట్టి, జుట్టును పట్టుకుని లాగారంటూ వెల్లడించారు. అనుపా అచ్యుతన్ తన భర్తతో ఎనిమిది సంవత్సరాలుగా ఐర్లాండ్లో నివసిస్తున్నారు. ఇటీవల ఐరిష్ పౌరసత్వం పొందారు. ఆమె పిల్లలు అక్కడే జన్మించారు.
ఘటన గురించి చెబుతూ... తన కుమార్తె వారి దాడితో ఏడ్చింది. ఆమె మాట్లాడలేకపోయింది, ఆమె చాలా భయపడింది. నా కూతురిని నేను ఎప్పుడూ అలా చూడలేదు. నేను ఆమె స్నేహితులను ఏమి జరిగిందని అడిగాను, వారందరూ చాలా బాధపడ్డారు, వారి కంటే పెద్దవాళ్ళయిన పిల్లల ముఠా సైకిల్తో ఆమె ప్రైవేట్ భాగాలపై ఢీకొట్టారని, వారిలో ఐదుగురు ఆమె ముఖంపై కొట్టారని ఆమె స్నేహితురాలు ఒకరు చెప్పారు అని వెల్లడించింది. దాడి చేసిన తర్వాత కూడా వారు ఎలాంటి భయం లేకుండా రోడ్డుపై అక్కడే తిరిగినట్లు ఆమె వెల్లడించారు.