నైజీరియాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న బోకోహరాం తీవ్రవాదులు మరోమారు పెట్రేగిపోయారు. నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో మూడు మారుమూల గ్రామాల్లో ఏకంగా 150 మందిని ఊచకోతకోశారు. అత్యాధునిక ఆయుధాలు చేతబట్టి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ... తమ మారణకాండను కొనసాగించారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటున్న పిల్లలను, మగవారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా ఇళ్లలో వంట చేస్తున్న మహిళలను ఊచకోతకోస్తూ.. ఇళ్లను తగులబెట్టారు. మేలో మహమ్మద్ బుహారీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత నైజీరియాలో ఇంతటి నరమేధం చోటు చేసుకోవడం ఇదే ప్రథమం.