భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్థాన్ వ్యతిరేకి అని ఆ దేశ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోపించారు. టీవీటీఎన్ ఛానెల్కు ముషారఫ్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత్పై మరోమారు తన అక్కసును వెళ్లగక్కాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆయన పాకిస్థాన్ వ్యతిరేకిగా అభివర్ణించారు.
అంతేకాక భారత్ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడి నుంచైనా తన భూభాగాన్ని రక్షించుకునేందుకు పాక్ సర్వ సన్నద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ తన వైఖరిని మార్చుకోవాలి. మోడీ ముస్లిం వ్యతిరేకి మాత్రమే కాదు, పాకిస్థాన్ వ్యతిరేకి కూడా అని ముషార్రఫ్ వ్యాఖ్యానించారు.
భారత భూభాగంలో జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్ ప్రమేయం ఎంత మాత్రం లేదని ఆయన వెనుకేసుకొచ్చారు. అయితే పాక్లో జరుగుతున్న హింసలో మాత్రం భారత ప్రమేయానికి స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. భారత గూఢచార సంస్థ ‘రా’ అధికారులు పాక్లో ధ్వంస రచనకు పాల్పడుతున్నారని ముషారఫ్ ఆరోపించారు.