బరువు తగ్గడానికి.. లేదా మరింత ఫిట్గా తయారవాలనుకునే వారు చాలా మంది ఉదయమే లేచి కసరత్తులు చేస్తుంటారు. పరగడుపునే శరీర వ్యాయామం చేస్తుంటారు.. ఏమి తీసుకోకుండా వ్యాయామం చేయడం ఎంత వరకూ మంచిది...? అనే సందేహం చాలా మందిలో ఉండేది. శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశంపై పరిశోధనలు చేశారు.
నిన్నమొన్నటిదాకా పరగడుపున వ్యాయామం చేయడం మంచిదికాదనే వాదనే బలంగా వినిపిస్తుండేది. కానీ ఆహారం తినకముందే వ్యాయమం చేయడం వల్ల ఎంతో మేలుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే భోజనం చేయనప్పుడు శరీరంలో స్రవించే కొన్ని హార్మోన్లు వ్యాయామానికి సాయపడతాయట.
వాటిలో కీలకమైంది 'గ్రోత్ హార్మోన్'. ఇది కండర రాశిని పెంచుతుందట. శరీరాన్ని స్థిరంగా ఉంచడంలో దీనిది కీలకపాత్ర. దాంతోపాటూ పరగడుపున చేసే వ్యాయామం ఆడా, మగా ఇద్దరిలోనూ టెస్టోస్టిరాన్ హార్మోన్ శాతాన్ని పెంచుతుందని బ్రిటిష్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనంలో నిరూపించారు.
దీనివల్ల కొవ్వు కరగిస్తుందని తేలింది. అంతే కాదు. పరగడుపున వ్యాయామం చేయడం వలన శక్తిస్థాయులు కూడా పెరుగుతాయి. మానసిక రుగ్మత, హృద్రోగాలూ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. కానీ, చక్కటి నిద్రవేళలు పాటిస్తూ అదీ క్రమం తప్పకుండా చేస్తే పరగడుపున చేసే వ్యాయామం మంచి ఫలితాలిస్తుందని పరిశోధనల్లో తేలింది.