రచయిత కథ రాస్తే చదవడానికి ఆసక్తిగా అనిపించాలి. చిన్నపిల్లలు పెద్దలు కూడా చదివే చందమామకథలు అంత ఆసక్తిని కనబరుస్తాయి. మరి సినిమాకూ కథ కావాలి. ఆ కథను ప్రేక్షకులకు చెప్పేవిధానం బాగుండాలి. అప్పుడే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. రచయిత కథను రాసుకుని దాన్ని తెరపై చూపించే విధానం కూడా అంతే ఇంట్రెస్ట్గా చూపిస్తే ఎలా ఉంటుందనేందుకు 'చందమామకథలు' ఓ ఉదాహరణ. హీరోయిజం, పాటలు, ఫైట్లు, డాన్స్లు, ద్వందార్థాలు వంటివి ఏమీలేకుండా చూస్తూనే కథను చదివేట్లుగా దర్శకుడు ప్రవీణ్సత్తార్ చేసిన ప్రయోగం ఎలా ఉందో చూద్దాం.
కథగా చెప్పాలంటే...
ఇందులో ఎనిమిది కథలుంటాయి. సారధి అనే ఓ రచయితకు కేర్సర్ సోకిన ఓ కూతురు. ఆమెకు ఆపరేన్ చేయించాలంటే 5లక్షలు కావాల్సిఉంటుంది. కథలు రాసి అమ్ముదామనుకుంటే మనస్సు సహకరించదు. ఓ బిచ్చగాడు, టూలెట్ బోర్డున్న ఇంటినే చూస్తూ ఆ చుట్టుపక్కలే అడుక్కుంటుంటాడు. అతనికి ఇల్లు కొనాలనే కోరిక. తను సంపాదించిన 10లక్షలత్తో కొనడానికి ప్రయత్నిస్తాడు. 30 ఏళ్లువచ్చినా పెండ్లికాని వ్యక్తి వెంకటేశ్వరరావు (కృష్ణుడు). మ్యాట్రిమోనియల్లో ప్రకటనలు ఇచ్చినా ఎవ్వరూ దొరకరు. సాప్ట్వేర్ ఉద్యోగంతోపాటు ఫ్లాట్ క్రెడిట్కార్డులు చాలానే ఉంటాయి. మరోపక్క 10ఏళ్ళనాడు దేశంలో పెద్దమోడల్గా ఉన్న లీసాస్మిత్... ప్రస్తుతం సరైన ప్రేమకు నోచుకోక ఉన్నది పోగొట్టుకుని మధ్యతరగతి మహిళగా బతుకు వెళ్ళదీస్తుంది. పచారీ షాపు నడిపే ముస్లిం యువకుడు ముస్లిం యువతిని ప్రేమిస్తాడు. కానీ తన స్వార్థాన్ని చూసుకుని దుబాయ్ చెక్కేస్తుంది. నరేష్ ఓ వ్యాపారవేత్త జీవితంలో ఎంతో సంపాదించి పిల్లలకు ఇచ్చేసి దేశాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇండియాకు వచ్చి తన పాత స్నేహితురాలి ఆమని ఇంటికి వస్తాడు. ఊల్ళో పనీపాటలేకుండా తిరిగే కుర్రాడు కథ. 16ఏళ్ళకే అక్కడ యువతిని వద్దన్నా పెద్దల ఒత్తిడితో పెండ్లిచేసుకుని సిటీకివచ్చి కార్పొరేషన్ చెత్త డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. స్కూల్ చదువులోనే గొప్పింటి అమ్మాయి ప్రేమిస్తున్నట్లు నటించి వంచించాలనుకునే కుర్రాడి కథ మరోది. ఇలా ఈ కథలన్నీ ఒకే ఒక్క దానితో ముడిపడిఉంటాయి. డబ్బు, ప్రేమ. అవి దొరికితే ఒక్కోకథ సుఖాంతమవుతుంది. అది ఎలా అనేది సినిమా.
విశ్లేష ణ:
ఇందులో నటించిన వారంతా తమతమ పాత్రలకు న్యాయం చేశారు. నరేష్, ఆమని జంబలకిడి పంబ తర్వాత వచ్చిన కాంబినేషన్. మధ్య వయస్సులోని వారు తాము ఏం కోల్పోయాము. అనేది చక్కగా చెప్పగలిగాడు దర్శకుడు. పుట్టినప్పటినుంచి తల్లిదండ్రులకోసం, తర్వాత భర్తకోసం, ఆ తర్వాత పిల్లలకోసం జీవితమంతా గడిపేస్తే తనకోసం బతకలేవా? అంటూ నరేష్ చెప్పిన డైలాగ్లు ఆ పాత్రలకు హైలైట్గా నిలుస్తాయి. ఒక్కో కథలో ఒక్కో నీతి ఉంటుంది. ఆ నీతి అంతా ప్రేమ. తాగ్యం. ప్రేమ స్వచ్చంగా ఉంటే అంతే స్వచ్చంగా ఫలితాలు కన్పిస్తాయి. మోసం చేయాలనుకుంటే దానికి ప్రతిఫలం ఇక్కడే అనుభవించాల్సి వస్తుంది.. ఇదే నీతిని దర్శకుడు తన చందమామల కథలద్వారా చెప్పగలిగాడు.
మధ్యవయస్కులుగా ఆమని, నరేస్ కరెక్ట్గా సరిపోయారు. గ్లామర్ మోడల్గా లక్ష్మీప్రసన్న జీవించిందనే చెప్పాలి. డబ్బుకోసం కొంతమంది యువత బైక్లోని పెట్రోలు కాజేసి అమ్మేసుకునే పాత్రలు నిజజీవితానికి దగ్గరగా చూపించాడు. చైతన్యకృష్ణ ఆ పాత్ర పోషించాడు. 30ఏళ్ళ పెండ్లికాని యువకుడిగా కృష్ణడు బాగానే సరిపోయాడు. బెగ్గర్గా రచయిత కృష్ణబాగా నటించాడు. ముగ్గురు ఆడపిల్లలున్న ఇంటి బామ్మగా పావలా శ్యామల పాత్రలో జీవించింది. ఇలా ప్రతిపాత్రను స్టడీచేసి దర్శకుడు ప్రవీణ్సత్తారు చేసిన ప్రయోగంలా అనిపిస్తుంది.
పాటలపరంగా ఒకే ఒక్కపాట బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. 'ప్రతిమనిషికో కథ ఉంది. ఏ కథైనా జీవితమంటే ఇంతేనా...' అంటూ సాగే ఈ పాటలోనే చిత్రం మొత్తం ఇమిడది ఉంది. నేపథ్యసంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ పర్వాలేదు.
కథలులేవు. అంటూ చాలా మంది హీరోలు, దర్శకులు చెబుతున్న మాట అబద్ధం. కథలనేవి మనచుట్టూనే ఉన్నాయి. వాటిని సరిగ్గా తీసుకుని తెరకెక్కిస్తే అద్భుతంగా తీయవచ్చని ప్రవీణ్సత్తార్ నిరూపించాడు. చాలా తక్కువ బడ్జెట్లోనే హైదరాబాద్లోనూ చుట్టుపక్కలే తీసేసిన ఈ చిత్రం క్లాస్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. బి,సి, వర్గాలను ఆలోచించేలా చేస్తుంది.