సినిమాలనేవి ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తుంటారు. అడపాదడపా కొన్ని సందేశాత్మక చిత్రాలు వస్తుంటాయి. కొన్ని ప్రయోగాత్మక చిత్రాలూ వస్తుంటాయి. చాలా తక్కువగా ఆలోచించే చిత్రాలు లేకపోలేదు. అయితే ఓటరును బేస్ చేసుకుని ఈమధ్య చాలా చిత్రాలు తయారువుతున్నాయి. ఎలక్షన్ల సీజన్ కాబట్టి... రకరకాల కాన్సెప్ట్తో వస్తున్న ఈ చిత్రాల్లో కామన్ పాయింట్ ఓటరును చైతన్యపర్చడమే. ప్రజల్ని ప్రశ్నించడమే. ఓటు విలువ తెలియజేయడమే. అయితే బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్ళు అయినా ఇంకా నెరవేరకపోవడం అనేది కాన్సెప్ట్తో తీసిన చిత్రమిది. ఇందులో దర్శకుడు నిర్మాత కథకుడు అన్నీ భాస్కరరావు మేడ్రాతి. తొలిసారిగా అన్ని బాధ్యతలు మీదవేసుకుని ఎలా నెరవేర్చాడో చూద్దాం.
కథగా చెప్పాలంటే.... అంబేద్కర్ పేరుతో ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతో మోస్తరు చదువుతో కలెక్టర్ స్థాయికి చేరిన బెనర్జీ, వ్యాపారవేత్త అయిన ఆహుతి ప్రసాద్, సమసమాజం పార్టీ నాయకుడైన నాగబాబు స్నేహితులు. వారి సంతానం అయిన చైతన్య(అజ్మల్), చందు, ప్రణీత కాలేజీలో స్నేహితులే. చైతన్యకు చదువు అబ్బక యూత్లీడర్గా చేసేస్తాడు నాగబాబు. ప్రణీత కలెక్టర్ అవుతుంది. చందు వ్యాపారవేత్త అవుతాడు. యూతంతా కలిసి ప్రణీత ఊరికి వెళతాడు.
ఆమె తాతయ్య పెంచలయ్య (నాజర్) ప్రజలకు ఏదో సేవ చేయాలనే అక్కడే ఉంటాడు. అనుకోకుండా తమ కాలేజీమేట్ ఏఎం సీటు రానందుకు ఆత్మహత్య చేసుకున్న ఇంటికి వెళతారు. రిజర్వేషన్ ఉన్నా... పోటీగా మరో వ్యక్తి ఉండటంవల్లే అతనికి సీటు రాలేదని పెంచలయ్య చెపుతాడు. అది నువ్వేనని చందుకు చెప్పడంతో... వారి ఆలోచనలు మారిపోతాయి. కలెక్టర్గా తను సమాజాన్ని మార్చాలనీ ప్రణీత, రాజకీయ పార్టీలో కొత్త మ్యానిఫెస్టో పెట్టి పార్టీన బలిష్టం చేయాలని చైతన్య కంకణం కట్టుకుంటారు. ఆ క్రమంలో వారి ప్రయత్నం సఫలం అయిందా...లేదా? అనేది సినిమా.
పెర్ఫార్మెన్స్ ఇందులో నటనాపరంగా అజ్మల్ ఒక్కడే ఎనర్జిటిక్గా నటించాడు. రంగంలోని కాస్త నెగెటివ్ షేడ్స్ ఈ పాత్రలోనూ కన్పించినా.. పాజిటివ్ పాత్ర తనది. పక్కన నటించిన చందు, ప్రణీత పాత్రలు రొటీన్ పాత్రలే. వారి తండ్రులుగా చేసిన సీనియర్ నటులు పాత్రలకు న్యాయం చేశారు. ప్రగతి పథం పార్టీ (పిపిపి) పార్టీ నాయకుడిగా కోట శ్రీనివాసరావు, మరో నాయకుడిగా చలపతిరావు పాత్రలు మామూలు రాజకీయనాయకులకు ప్రతినిధులే.
టెక్నికల్గా.. ఇందులో చెప్పాల్సింది.. సంగీతపరంగా వేసిన బాణీలు కొత్తగా ఏమీలేవు. ఎడిటింగ్ సోసోగానే ఉంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ముఖ్యంగా స్క్రీన్ప్లే, కథ, దర్శకత్వం నిర్వహించిన భాస్కరరావు కొత్తవాడు కావడంతో ఆ ఛాయలు కన్పిస్తాయి.
విశ్లేషణ... సినిమా మొత్తం ఓటరును చైతన్యపర్చే క్రమంలో ప్రశ్నలు సంధించేట్లుగా ఉంటుంది. కామన్ పీపుల్ రోజూ అనుకునే మాటలు, ప్రశ్నలు ఈ సినిమాలో కన్పిస్తాయి. ఓటును రక్తం అమ్ముకున్నట్లు నోటు కోసం అమ్ముకోవడం ఎంత దౌర్భాగ్యమో సంభాషణల్లో చెబుతారు. రెండే పార్టీలు ఉండటంతో ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి హీరో పార్టీ గెలుస్తుంది. హీరో అయిన చైతన్య. ఓటరును చైతన్యపర్చే కాన్సెప్ట్ను కొత్తగా ప్రవేశపెడతాను. ఇంటింటికి వెళ్ళి ఓటు విలువను తెలియజెప్పడం.. ఓటరు దేవుడు అని స్లోగన్తో ప్రచారం చేయడం.... కాసేపటికి ఓటరు మారిపోవడం అంతా సినిమాటిక్గా ఉంటుంది.
సినిమాలో ప్రధాన సమస్య.. అంబేద్కర్ నెలకొల్పిన రిజర్వేషన్లు. అట్టడుగు ఉన్న దళితులకు అందకపోవడం అనేది. దీన్ని బేస్ చేసుకుని కథను రాసుకున్నారు. ఒకే కుటుంబంలో దళితుడిగా ఉన్నతస్థాయిలో ఉండి కూడా.. ఇంకా రిజర్వేషన్ ఫలాలు అనుభవించడం తప్పని చెప్పే డైలాగ్లే సినిమాకు కీలకం. ఇవి మిగిలిన అణగారిన వర్గాలకు ఇవ్వమని చెప్పడమే సినిమా ఉద్దేశ్యం. అయితే దీన్ని సాధించాలంటే ఓటరులోనే మార్పు రావాలి. అంటే ప్రజల్లోనే మార్పు తేవాలి. అయితే రాజకీయ పార్టీలు ఇందుకు ఒప్పుకోవు. కనుక ప్రతిసారి ఐదేళ్ళకు పాడిందే పాటగా.. రిజర్వేషన్ను కొనసాగించి ఓటరును ఏ విధంగా మోసం చేస్తున్నారనేది చెప్పారు.
సమాజంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. అన్నింటి గురించి ప్రస్తావించకుండా కేవలం రెండే పార్టీలతో ఉండే రాష్ట్రంగా దర్శకుడు ఎంచుకున్న కథ అతకలేదు. అలా రెండే పార్టీలుంటే ఓటరును దర్శకుడు అనుకున్నట్లు మార్చడం చాలా ఈజీ. అప్పుడు రాష్ట్రంతోపాటు దేశం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కానీ పుట్టగొడుగుల్లా పార్టీలు పుట్టుకుని ప్రజాసేవ పేరుతో ఓటరును ఏవిధంగా కన్ఫ్యూజ్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారనే దానిపై కథ రాసుకుంటే కథ మరోలా ఉండేది. అందుకే ఈ చిత్రం ఫీల్ లేని చిత్రంగా మిగులుతుంది మినహా ఆశించిన ఫలితం కన్పించదు.