నా పేరు వరుణ్ సందేశ్. వరుణ్ అంటే వర్షం. నేను పుట్టినప్పుడు వరదలు, ఉరుములు మెరుపులతో గందరగోళంగా ఉంది. అందుకే తల్లిదండ్రులు వరుణ్ సందేశ్ అని పెట్టారంటూ.. తన పుట్టినప్పటి పరిస్థితిని వివరించాడు వరుణ్ సందేశ్. ఇదంతా 'వర్షం సాక్షిగా' అనే సినిమా కోసం.
రాహుల్ మూవీ మేకర్స్ బ్యానర్పై రమణ మొగిలి దర్శకుడిగా 'ఈ వర్షం సాక్షిగా' చిత్రం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. వరుణ్ సందేశ్, హరిప్రియ మరోసారి జతకట్టారు. బి.ఓబుల్ సుబ్బారెడ్డి, శ్రీనివాస్ చవాకుల నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి ప్రసన్నకుమార్ క్లాప్నిచ్చారు. తణుకు ఎమ్.ఎల్.ఏ కార్మూరి నాగేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. విద్యాసాగర్ గౌరవ దర్శకత్వం వహించగా చిత్రీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ... ఈ వర్షం సాక్షిగా నాకు చాలా కనెక్టింగ్ టైటిల్. ఎందుకంటే నేను 1989 ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒరిస్సాలో పుట్టాను. దాంతో వర్షానికి నాకు మంచి కనెక్షన్ ఉంది. ఇదొక క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరి. దర్శకుడు కథ చెప్పినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అని అన్నారు.
నిర్మాత బి ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ఇప్పటివరకు భోజ్పురిలో సినిమాలు తీశాం. మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాం. కథ చాలా బావుంది. సందేశాత్మక చిత్రమిది. ఈ రోజు నుండి వచ్చేనెల 21 వరకు మొదటి షెడ్యూల్ చేస్తాం. ఏప్రిల్ 12 నుండి నెలాఖరు వరకు రెండో షెడ్యూల్ చేసి, మూడో షెడ్యూల్లో అబ్రాడ్లో పాటలను చిత్రీకరిస్తాము. తెలుగులో మేం చేస్తున్న తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
దర్శకుడు రమణ మొగిలి మాట్లాడుతూ... నిర్మాతలకు తెలుగులో ఫస్ట్ వెంచరిది. కథ చెప్పగానే వరుణ్ సందేశ్ చాలా ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళ నాన్న గారు కూడా మంచి కథ, వరుణ్ తప్పకుండా చేస్తాడు అని ఓకే చేశారు. యువత లైఫ్ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమికులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పే చిత్రమిది. యువతకు చిన్న సందేశం కూడా ఈ చిత్రం ద్వారా ఇవ్వబోతున్నాము. 100 శాతం కృషి చేసి ఈ సినిమా విజయవంతం అయ్యేలా చూస్తాను. వరుణ్, హరిప్రియ ఈ చిత్రానికి చాలా బెస్ట్ పెయిర్ అని చెప్పాలి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాశీవిశ్వనాధ్, మాటల రచయిత రామస్వామి, మరో నిర్మాత శ్రీనివాస్ చవాకుల తదితరులు పాల్గొన్నారు.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు : చలపతిరావు, కాశీవిశ్వనాధ్, హేమ, ఢిల్లీ రాజేశ్వరి, శివారెడ్డి, ధనరాజ్, వేణు, చంద్ర, పొట్టి చిట్టిబాబు, చాణక్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:మోహన్చంద్ర, సంగీతం: అనిల్ గోపిరెడ్డి, ఎడిటింగ్: నందమూరి హరి, ఆర్ట్: నాగసాయి, కథ: ముకుంద్ పాండే, మాటలు: రామస్వామి, పాటలు:భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, విజయ్కుమార్, అడిషనల్ స్క్రీన్ప్లే: కె, రాజేంద్ర భరద్వాజ్, నిర్మాత:బి.ఓబుల్ సుబ్బారెడ్డి మరియు శ్రీనివాస్ చవాకుల, దర్శకత్వం: రమణ మొగిలి.