ఇచ్చిన డబ్బులు జేబులో వేసుకుంటావా.. సిగ్గులేదా? చింతాను చీవాట్లు పెట్టిన సోనియా.. కాంగ్రెస్కు రాంరాం!
తిరుపతిలో రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 136 యేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా సీనియర్ నాయకుడిగా పనిచే
తిరుపతిలో రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 136 యేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా సీనియర్ నాయకుడిగా పనిచేసిన చింతామోహన్ ఆ పార్టీకి దూరమవుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సొంతం అనుకున్న అనుచరులను కూడా కలువకుండా చింతా ముభావంగా ఉంటున్నారని కుటుంబ సభ్యులే చెబుతున్నారు.
చాచా నెహ్రో నుంచి సోనియాగాంధీ వరకు అందరితో కలిసి పనిచేసిన తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యులు చింతామోహన్ ప్రస్తుతం అంధకారంలోకి వెళ్ళిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం, పార్టీ జెండాలే మోసే వారు కూడా లేకపోవడంతో చింతామోహన్ కూడా సైలెంట్ అయిపోయారు. తిరుపతి శాసనసభ్యులుగా ఉన్న వెంకరమణ మరణంతో ఉప ఎన్నికలు వచ్చిన తరుణంలో తాను నిర్ణయించిన అభ్యర్థినే పెట్టాలని అధిష్టానాన్ని కోరారు చింతామోహన్.
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో పాటు, స్థానిక కాంగ్రెస్ నేతలు చింతామోహన్ ప్రకటించిన అభ్యర్థినిని వద్దని ఎంత వారించినా ఆయన మాత్రం వినలేదు. నేరుగా అధినేత్రి సోనియా గాంధీ వద్దకు వెళ్ళి బీఫాం తీసుకొచ్చారు. దీంతో స్థానిక నేతలకు అసలు మింగుడు పడలేదు. ఆ ఉప ఎన్నికల్లో చింతామోహన్ మాత్రమే తిరిగి అభ్యర్థినిని గెలిపించడంటూ వేడుకున్నాడు. అయినా ఫలితం లేకుండా పోగా కనీసం డిపాజిట్ కూడా రాలేదు.
తిరుపతి ఉప ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ నుంచి అభ్యర్థే అవసరం లేదని సోనియా గాంధీకి వివరించారు రఘువీరారెడ్డి. ఒకవేళ అభ్యర్థినిని నిలబెట్టినా గెలిచేది మాత్రం సానుభూతేనని, తెదేపా అభ్యర్థినిని భారీ విజయంతో గెలుస్తుందని రఘువీరా చెప్పారు. అయితే చింతామోహన్ మాత్రం ఏ మాత్రం అందుకు అంగీకరించలేదు. తాను అభ్యర్థినిని నిలబడతానని, ఆ అభ్యర్థిని ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమాను అధినేత్రి ముందు ఉంచారు. పార్టీలో సీనియర్ నాయకుడు కావడంతో ఇక చేసేది లేక సోనియాగాంధీ పచ్చజెండా ఊపారు. అయితే ఓటమి కావడంతో చింతాపై అధినేత్రికి చెప్పాల్సిందంతా చెప్పేశారు స్థానిక నేతలు.
ఎన్నికల్లో సమయంలో పార్టీ నుంచి చింతామోహన్ కొంత ఫండ్ కూడా తీసుకువచ్చినట్లు సమాచారం. ఆ డబ్బును పంచకుండానే ఎన్నికల్లోకి వెళ్ళారని స్థానిక నేతలు సోనియా దృష్టికి తీసుకెళ్ళారు. ఇంకేముంది చింతామోహన్పై కాస్త కోపంగానే ఉన్నారు సోనియా. దీంతో గత కొన్ని నెలల ముందు ఢిల్లీకి వెళ్ళినపుడు చింతామోహన్ను అధినేత్రి సరిగ్గా పలుకరించలేదని తెలుస్తోంది. అధినేత్రి తీరుపై చింతామోహన్ మనస్థాపానికి గురైనట్లు సమాచారం.
ఇదిలావుంటే గత కొన్నిరోజులకు ముందు నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ సిపిలోను, కమ్యూనిస్టులలోనే కలిపేయాలని కూడా చింతామోహన్ అన్నారు. ఈ విషయం కూడా అధినేత దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్ళినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్పార్టీకి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. మాజీ కేంద్రమంత్రులు ఎవరు తిరుపతికి వచ్చినా చింతామోహన్ను కలిసే వెళుతుంటారు.
అయితే ఎవరినీ చింతామోహన్ కలవకుండా ముభావంగా ఉంటున్నట్లు సమాచారం. చింతామోహన్కు ముందు నుంచీ బిజెపి నాయకులతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకవేళ ఆయన సైలెంట్గా ఉండడానికి కారణం పార్టీ మార్పేనా అన్న అనుమానాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం బిజెపి అగ్రనేతలతో కూడా చింతామోహన్ మాట్లాడినట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అయితే చింతామోహన్ కాంగ్రెస్పార్టీలో ఉంటారా..లేకుంటే ఈయన కూడా బిజెపి తీర్థం పుచ్చుకుంటారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.