ఇప్పటివరకు సినిమాలో మోనార్క్ను చూశాం. కానీ రాజకీయాల్లో కూడా అలాంటి మోనార్క్ ఒకరున్నారు. అది కూడా ఏపీ సిఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే. ఆయనెవరో కాదు చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్. ఆయన చెప్పిందే జరగాలి, కాదు చెప్పిందే చెయ్యాలి లేకుంటే ఆయన మోనార్క్ అవతారం ఎత్తుతారు. ఎవరినన్నా సరే వదిలిపెట్టడు. ఎంతమంది ఉన్నా సరే చడామడా తిట్టేస్తాడు. అంతటితో ఆగడు.. పార్టీ నుంచి సాగనంపేస్తారు కూడా. దటీజ్ శివప్రసాద్..
చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయన అసలు ఎంపీ కావడానికి ప్రధాన కారణం సీఎం చంద్రబాబు నాయుడే. అదెలాగంటారా..? కుప్పం నియోజవర్గం నుంచి చంద్రబాబునాయుడు పోటీ చేయడం ఆ నియోజవర్గం కాస్త చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉండడం శివప్రసాద్కు కలిసొస్తోంది. ఎమ్మెల్యేగా చంద్రబాబునాయుడు వేసే వారిలో ఎక్కువమంది ఎంపి శివప్రసాద్కు ఓటేస్తున్నారు. ఇలా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు శివప్రసాద్.
ఈయన ఎప్పుడు సైలెంట్గా ఉండటం అలవాటు లేదు. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ఏపీలో జరిగే పోరాటాలేవైనా సరే ఆయన ముందుంటారు. వెరైటీ వేషధారణలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈయన ఏదైనా కార్యక్రమం చేస్తే లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు అన్ని కెమెరాలు ఆయనవైపే ఉండాలి. అదీ ఆయన టాలెంట్.. ఇదంతా బాగానే ఉన్నా శివప్రసాద్లో మరో కోణం ఉంది. అదే మోనార్క్. తన పరిధిలో ఉన్న తెదేపా నేతలు, కార్యకర్తలు ఎవరైనా సరే ఈయన మాట వినాల్సిందే.
పార్టీ కార్యక్రమాలైనా, వేరే ఏ నిరసన కార్యక్రమాలన్నా సరే ముందు సార్కు చెప్పి చేయాలి. కార్యక్రమం చేయాలనుకుని ఎవరైనా అనుకున్న వెంటనే ఎంపిగారికి వెంటనే తెలియజేయాలి. ఇది ఒక్క చిత్తూరు పార్లమెంట్ పరిధిలో మాత్రమే కాదు. మొత్తం జిల్లానే. తిరుపతి పార్లమెంట్ తన పరిధి కాకపోయినా ఆయన మాత్రం ఇక్కడ కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఇప్పటివరకు పాల్గొన్నారు..పాల్గొంటూనే ఉన్నారు. ఆయన ఏ కార్యక్రమానికి వచ్చినా ముందుగా ఆయన్నే మాట్లాడించాలి. అవసరమైతే యాంకర్గా కూడా ఆయనే ఉంటారు.
సీఎం కార్యక్రమమైనా, మంత్రుల కార్యక్రమమైనా వెంటనే ప్రత్యక్షమవుతారు శివప్రసాద్. పార్టీ కార్యకర్తలు, నాయకులను ఆయన చేరదీయడం లేదన్న విమర్శలు లేకపోలేదు. కష్టాల్లో ఉన్న కార్యకర్త ఎవరైనా శివప్రసాద్ వద్దకు వెళితే నీ కష్టం నువ్వు చూసుకోవాలి. నా దగ్గరికి వస్తే ఎలా అంటూ తిప్పిపంపేస్తారంట. అంతేకాదు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో తనని కాకుండా వేరే ఎవరైనా ప్రముఖులను అతిగా పొగిడితే ఇక శివప్రసాద్కు నచ్చదు. కార్యక్రమం అయ్యేంత వరకు సైలెంట్గా ఉంటారు. ఆ తర్వాతే తన ప్రతాపం చూపిస్తారు. అసలు శివప్రసాద్ కార్యక్రమమంటేనే చిత్తూరు జిల్లా పరిధిలోని తెదేపా కార్యకర్తలు, నాయకులు భయపడిపోతున్నారు.
విషయం మొత్తాన్ని అధినాయకుడిని చెప్పాలనుకుని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు కూడా. సీఎం సొంతవూరు నారావారిపల్లి, తిరుపతిలలో పర్యటించినపుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎంపిపైనే ఫిర్యాదు చేస్తే అధినేత ఏ విధంగా స్పందిస్తారో.. ఆ తర్వాత ఎంపి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న భయంతో కార్యకర్తలు, నాయకులు వెనుకబడి పోయారు. మొత్తం మీద చిత్తూరు ఎంపి శివప్రసాద్ వ్యవహారంపై అధినేత సిఎం చంద్రబాబునాయుడు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.