హోదా రాదని తెలిసి... 'దూకుడు' సీన్ రిపీట్! ఏపీలో నేతల రాజకీయ నాటకం!!
విజయవాడ: ఎన్టీరామారావు ఇపుడు ప్రధాని అయ్యారుగా... అంటూ, దూకుడు సినిమాలో తండ్రి ప్రకాశ్ రాజ్ను దక్కించుకోవడానికి మహేష్ బాబు అండ్ కో నాటకం ఆడతారు... ఎర్రకోటపై ఎన్టీయార్ స్పీచ్ కూడా సినిమా చూపిస్తారు. ఇపుడు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలోనూ దూకు
విజయవాడ: ఎన్టీరామారావు ఇపుడు ప్రధాని అయ్యారుగా... అంటూ, దూకుడు సినిమాలో తండ్రి ప్రకాశ్ రాజ్ను దక్కించుకోవడానికి మహేష్ బాబు అండ్ కో నాటకం ఆడతారు... ఎర్రకోటపై ఎన్టీయార్ స్పీచ్ కూడా సినిమా చూపిస్తారు. ఇపుడు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలోనూ దూకుడు సీన్ రెండోసారి రిపీట్ అవుతోంది. ఆంధ్ర ప్రజల్ని మభ్యపెట్టి... మబ్బులో పెట్టి... రాష్ట్రం విడిపోదని నమ్మబలికి నాడు ఆఖరి నిమిషం వరకూ సమైక్య ఉద్యమాలు చేయించిన నేతలు ... ఇపుడు ప్రత్యేక హోదాపైనా ఆఖరి నిమిషం వరకూ దూకుడు సినిమాలా నాటకం ఆడుతున్నారు.
ఇంకా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, వస్తుందని... మోడీని కలిశామని...అడిగామని... ఇస్తారని...ఇలా మభ్యపెడుతూనే ఉన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని... పోరాడి దాన్ని సాధిస్తామని... మా నేత చంద్రబాబు కేంద్రం వద్ద ఆచితూచి అడుగులు వేస్తున్నారని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు... బీజేపీ వాళ్ళేమో తమకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రమే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.. కానీ, అందరికీ తెలియాల్సిన కఠోర సత్యం ఏమిటంటే... ప్రత్యేక హోదా హుళక్కే... అది ఎప్పటికీ అందని ద్రాక్షే! హోదా గురించి ఆంధ్ర రాజకీయ నేతలు చేస్తున్నదంతా... దూకుడు సినిమా సీనే!
హోదా రాదని సీఎం చంద్రబాబుకు ముందే తెలుసా?
ప్రత్యేక హోదాను టీవీ సీరియల్లా సాగదీస్తూ, ఎపిసోడ్కి ఒక మాట మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకు అంతా ముందే తెలుసని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నడూ ఆయన సీరియస్గా కేంద్రంతోగాని, ప్రధానితోగాని ఈ విషయం చర్చించపోవడం ఇందులో గమనార్హం. పైగా, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సెంటిమెంట్గా ఎక్కడ సాలిడ్ అయిపోతుందో అని నిత్యం లోలోన భయపడి... కుమిలిపోతున్న పెద్దమనిషి చంద్రబాబే అని ఆయన ముఖకవళికలు పరిశీలనగా చూసిన వారికి అర్ధం అవుతుంది. అందుకే ఆయన అధికారం చేపట్టిన ఏడాది లోపే, ప్రత్యేక హోదా సంజీవని కాదని, ఆ సెంటిమెంట్ ప్రజల నెత్తికి ఎక్కకుండా అడ్డుకట్ట వేశారు.
పైగా, ఏడాదిన్నర కాగానే... అసలు ప్రత్యేక హోదా వల్ల నష్టమా? లాభమా? అనేది చర్చించాలంటే... అప్పట్లో రోజుకో గంట విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రజల బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశారు. నేనేమంటున్నా...అంటే... వాటయామ్ సేయింగ్... అంటూ, అప్పట్లో శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు.
ఇపుడు అంత వీజీ కాదంటున్న సీఎం చంద్రబాబు
తాజాగా విజయవాడలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే.. అది వస్తుంది.. ఇది వస్తుందంటూ కొందరు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కానీ ప్రత్యేక హోదా తేవడమంటే అంత ఈజీ కాదని అంటున్నారు. చంద్రబాబు శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఢిల్లీకి వెళ్లి ఇంతగా కష్టపడాల్సి వస్తోందంటే, దానికి కాంగ్రెసే కారణమన్నారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల్ని ప్రతిపక్షాలు మభ్యపెడుతున్నాయన్నారు. హోదా వస్తే అది వస్తుంది, ఇది వస్తుందంటూ ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నారు. 'హోదా తేవడమంటే ఇంట్లో కూర్చొని దొంగ లెక్కలు రాసుకున్నంత ఈజీ కాదు.. కష్టపడి తేవాలి' అని ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు.
ఆంధ్ర పడినన్ని ఇబ్బందులు చరిత్రలో మరే ఇతర రాష్ట్రం పడలేదని చంద్రబాబు అన్నారు. 'ఒకప్పుడు చెన్నైని డెవలప్ చేశాం, అనంతరం మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మొదట కర్నూలు రాజధానిగా ఉండేది, చివరికి హైదరాబాద్ రాజధాని అయింది. హైదరాబాద్నూ డెవలప్ చేశాం. అక్కడి నుంచి మళ్లీ కట్టుబట్టలతో వచ్చాం. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తాం. గతంలో అన్ని రాజధాని నగరాలనూ డెవలప్ చేశాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిని డెవలప్ చేయడం తథ్యం' అని చెప్పుకొచ్చారు.
మరి ఈ కష్టాలన్నీ ఆంధ్ర ప్రజలకు ఇక్కడి రాజకీయ నేతల స్వార్ధం వల్ల వచ్చినవి కావంటారా? ఇంకా ఎన్నాళ్ళిలా దూకుడు సీన్ చూపిస్తారు... కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగడం కోసమే...కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నామని చెప్పుకొస్తారు... చివరికి గ్రాఫిక్స్లో ప్రజల ఆశల్నిచెరిపేస్తారు... చెప్మా?