దక్షిణాది రాష్ట్రాల్లో అమిత్ షా మొదటి టార్గెట్ తెలంగాణ?
ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాలవైపు అడుగులు వేస్తోంది. ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్లో విజయం తర్వాత సంబరాల్లో ఉన్న బీజేపీ నేతలు అదే విజయాత్రను కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నా
ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాలవైపు అడుగులు వేస్తోంది. ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్లో విజయం తర్వాత సంబరాల్లో ఉన్న బీజేపీ నేతలు అదే విజయాత్రను కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఏకంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది.
2013లో మొదలుపెట్టిన మోడీ - అమిత్ షా జోడీ జైత్రయాత్ర విజయవంతంగా సాగుతోంది. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నారు. అసేతుహిమాచలంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ ముద్ర ఉండాలన్నది వారి అంతిమలక్ష్యం. సగం రాష్ట్రాల్లో అయినా ఎప్పుడూ అధికారం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉండాలని కోరుకుంటున్నారు. వీరు సామాన్యులు కాదు.. అనుకున్న గమ్యం వైపు ప్రత్యర్థులు, సొంత పార్టీలో వ్యతిరేకులు ఊహించిన దానికన్నా వేగంగా దూసుకెళుతున్నారు. 2014లో ఢిల్లీ పీఠం దక్కించుకున్నారు. తర్వాత రాష్ట్రాలపై గురిపెట్టారు.
హర్యానా, జార్ఖండ్లలో అధికారంలోకి వచ్చారు. మహారాష్ట్రలో మిత్రులనే దాటేశారు. అసోంలో జీరో నుంచి మొదలై పగ్గాలు అందిపుచ్చుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో పాగా వేశారు. కాశ్మీర్లో పట్టు సాధించి మిత్రపక్షంతో కలిసి అధికారం పంచుకుంటున్నారు. ఉత్తరాది నుంచి పశ్చిమ అక్కడి నుంచి ఈశాన్య ప్రాంతానికి విస్తరించారు. మధ్య భారతంలో యూపీలోనూ ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యం సంపాదించారు. అమిత్ షా సోషల్ ఇంజినీరింగ్ మహిమ మాయ చేసింది. ఏకపక్షంగా అధికారం దక్కింది. మరి ఇప్పుడు టార్గెట్ దక్షణాది రాష్ట్రాలు.. ఇందులో ముందువరుసలో ఉంది తెలంగాణ.
తెలంగాణలో ఉన్న భావజాలం.. హిందూ సంస్థలకు బలమైన పునాదులు కావొచ్చు పార్టీ దృష్టి మాత్రం రాష్ట్రంపై పడింది. అమిత్ షా ఆపరేషన్ 2019 మరికొద్దిరోజుల్లోనే మొదలుకానున్నట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. యూపీ తర్వాత తన లక్ష్యం తెలంగాణ అని గతంలోనే అమిత్ షా పార్టీ నాయకులకు ఇదివరకే చెప్పారు. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారట. అవసరమైతే కొత్త నాయకత్వం కింద పనిచేయడానికి సిద్దంగా ఉండాలని రాష్ట్ర నాయకులకు సంకేతాలు కూడా గతంలోనే ఇచ్చినట్టు చెబుతున్నారు.
యూపీ ఎన్నికలు ఫలితాలు రావడంతో అమిత్ షా మిషన్ ఇక తెలంగాణలో మొదలు అవుతుందట. త్వరలోనే మూడు రోజుల పర్యటనకు రానున్నారు. తెలంగాణలో పార్టీకి ఓటు బ్యాంకు ఉంది. అర్బన్ ఓటింగ్ కూడా ఎక్కువ. అయితే పార్టీకి మాస్ లీడర్ లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. దీంతో అసోం తరహాలో మాస్ ఫోలోయింగ్ ఉన్న నేతను వెతికి మరీ తమగూటిలో చేర్చుకునే పనిలో ఉందట.
అమిత్ షా పని మొదలుపెట్టిన తర్వాత రానున్న ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని నేతలు అంటున్నారు. యూపీలో పనిచేసిన బ్యాక్ ఆఫీస్ టీం మొత్తం తెలంగాణలో మకాం వేసి.. సోషల్ ఇంజినీరింగ్ ద్వారా గ్రామస్థాయి క్యాడర్ వరకు యాక్టీవ్ చేయనున్నారట. మరి బీజేపీ ఇక్కడ కూడా తన సత్తా చాటుతుందా? నాలుగు సీట్లు ఉన్న హరియాణాలో అధికారంలోకి వచ్చాం… ఐదు సీట్లున్న తెలంగాణలో పార్టీ గెలవదా? అంటున్నారు. మరి తెలంగాణాలో బీజేపీ ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో వేచి చూడక తప్పదు.