విండీస్ క్రికెటర్లకు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు మధ్య వివాదం ముదిరిపాకాన పడింది. ఫలితంగా భారత్ పర్యటనను విండీస్ బోర్డు అర్థాంతరంగా రద్దు చేసుకుంది. విండీస్ క్రికెటర్లకు బోర్డుకు మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు. బోర్డు తమ పారితోషికంలో కోత పెట్టడాన్ని ఆటగాళ్ళు కొంతకాలంగా నిరసిస్తున్నారు.
భారత్తో తొలి వన్డే ఆరంభానికి ముందు బాయ్ కాట్ హెచ్చరిక పంపిన కరీబియన్లు బీసీసీఐ జోక్యంతో ఆ మ్యాచ్లో పాల్గొన్నారు. తాజాగా, బోర్డుకు, ఆటగాళ్ళకు మధ్య వివాదం మరింత ముదిరింది. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు విండీస్ బోర్డు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో, విండీస్ క్రికెటర్లు ధర్మశాల వన్డే తర్వాత, సొంత ఖర్చులతో స్వదేశం వెళ్ళిపోవాలని నిర్ణయించారు. ఫలితంగా ఐదో వన్డేతో పాటు.. ఏకైక ట్వంటీ20 మ్యాచ్, టెస్ట్ సిరీస్ నుంచి విండీస్ క్రికెటర్లు తప్పుకున్నారు.
దీంతో అప్రమత్తమైన బీసీసీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. భారత పర్యటనను మధ్యలోనే ముగించుకుని పోవాలని వెస్టిండీస్ జట్టు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో శ్రీలంకను బీసీసీఐ ఆహ్వానించింది. ఈ మేరకు భారత్తో ఆడేందుకు బీసీసీఐ చేసిన ఐదు వన్డేల ఆఫర్ను లంక బోర్డు అంగీకరించింది. శ్రీలంక క్రికెట్ చీఫ్ నిశాంత రణతుంగ ఈ విషయాన్ని ధృవీకరించారు.
బీసీసీఐ చేసిన ఆఫర్ను 'సూత్రప్రాయంగా' అంగీకరించినట్లు చెప్పారు. నవంబర్ 1 నుంచి 15 వరకు ఐదు వన్డేలు జరగనున్నాయి. అలాగే, క్రికెట్ సిరీస్ను అర్థాంతరంగా రద్దు చేసుకున్న విండీస్ క్రికెట్ బోర్డుపై న్యాయపరమైన చర్యలకు బీసీసీఐ సిద్ధమవుతోంది.