యూఎపీఎస్సీ పరీక్షల్లో మహారాష్ట్ర టాపర్గా నిలిచిన అబోలీ నరవాణే మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కరే స్ఫూర్తి అంటున్నారు. తాను సచిన్ను ప్రేరణగా తీసుకుని సివిల్స్లో ఘనవిజయం సాధించానని గర్వంగా చెప్పారు. ఆలిండియా లెవెల్లో 78వ ర్యాంకు సాధించిన అబోలీ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ... సచిన్ జీవితచరిత్రను కనీసం ఆరుసార్లు చదివి ఉంటానని వెల్లడించారు.
ముఖ్యంగా, మాస్టర్లోని మూడు గుణాలు స్ఫూర్తిదాయకమని.. అవి.. ఆట పట్ల అంకితభావం, నేల విడిచి సాము చెయ్యని తత్వం, దేశం కోసం సర్వశక్తులు ఒడ్డడం అని.. ఇవే తనలో ఉత్సాహం నింపాయని వివరించారు. కాగా, ఎంఏ ఎకనామిక్స్ చదివిన ఈ మహారాష్ట్ర యువతి కథక్ లోనూ ప్రావీణ్యం సంపాదించడం విశేషం. తనకెప్పుడైనా కాలేజ్ పుస్తకాలు బోరు కొడితే, వెంటనే సచిన్ బెస్ట్ ఇన్నింగ్స్ చూస్తానని అబోలి చెప్పారు.