ప్రస్తుతం స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయభేరీ మోగించింది. రెండో టెస్టు కూడా చెన్నైలోనే జరుగనుంది. అయితే, తొలి టెస్టుకు దూరమైన అక్షర్ పటేల్ ఇపుడు అందుబాటులోకి వచ్చినట్టు బీసీసీఐ వెల్లడించింది.
ఇదే అంశంపై బీసీసీఐ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తొలి టెస్టుకు ముందు అతడి ఎడమ మోకాలిలో నొప్పి కారణంగా పక్కకు పెట్టారు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న అక్షర్.. రెండో టెస్టు తుది జట్టు ఎంపికకు సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇక అంతకుముందు షాబాజ్ నదీమ్, రాహుల్ చాహర్ను ప్రధాన ఆటగాళ్ల జాబితాకు ఎంపిక చేయగా ఇప్పుడు వారిని మళ్లీ స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలోకి చేర్చారు. కాగా, తొలి టెస్టులో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్లో నదీమ్ అనూహ్యంగా తుది 11 మందిలో చోటు దక్కించుకున్నాడు.
సహజంగా కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ చివరి క్షణంలో జట్టు యాజమాన్యం నదీమ్ను తీసుకుంది. అయితే, వచ్చిన అవకాశాన్ని ఈ యువ క్రికెటర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాంతో రెండో టెస్టు నుంచి అతడిని తొలగించారని తెలుస్తోంది.