భారత క్రికెట్ అభిమానుల చర్యలను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ అభిమానుల మైండ్ సెట్ ఏమాత్రం మారలేదని సామాజిక వెబ్ సైట్లలో ట్వీట్స్ వెల్లువల్లా వస్తున్నాయి. కటక్లోని బారాబతి స్టేడియంలో సోమవారం జరిగిన క్రికెట్ అభిమానుల రగడ 1996 నాటి వరల్డ్ కప్లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ని గుర్తుకు తెచ్చింది.
భారత పరాజయాన్ని చవిచూడటాన్ని జీర్ణించుకోలేని అభిమానులు ఆనాడు స్టేడియంలో రణరంగం సృష్టించారు. అందుబాటులో ఉన్న వస్తువులన్నీ స్టేడియంలో విసిరారు. మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోగా, క్రీజులో ఉన్న వినోద్ కాంబ్లీ కన్నీటితో మైదానాన్ని దాటాల్సి వచ్చింది. సరిగ్గా 19 సంవత్సరాల తర్వాత అలాంటి సంఘటనే కటక్లో చోటుచేసుకుంది. అయితే ఈసారి కాంబ్లీ మిస్ అయ్యాడు.
టీ-20 మ్యాచ్లో ధోనీ సేన ఓడిపోవడాన్ని తట్టుకోలేని అభిమానులు.. చేతిలోని వాటర్ బాటిల్స్తో విధ్వంసం సృష్టించారు. దీంతో మ్యాచ్కి మూడుసార్లు అంతరాయం కలిగింది. ఆనాడు వినోద్ కాంబ్లీ కన్నీరు కార్చగా, నేడు ఆ పని చేసేందుకు ఎవరూ లేకపోయారని సామాజిక మాధ్యమాల్లో పలువురు ట్వీట్లు చేశారు.