దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఈ వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడినవారిలో 60 యేళ్లకు పైబడిన వారు తిరిగి కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేరళలో తొలి కరోనా మరణం సంభవించింది. కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన 69 యేళ్ళ రోగి శనివారం కన్నుమూశారు. కరోనా వైరస్ కారణంగానే వృద్ధుడు మృతి చెందినట్లు ఎర్నాకులం జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్కే.కుట్టప్పన్ మీడియాకు వెల్లడించారు. కేరళలో వృద్ధుడి మరణంతో భారతదేశంతో కరోనా మృతుల సంఖ్య 20కి చేరింది.
మరోవైపు, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 873కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 12 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఇంకోవైపు, కరోనా వైరస్ వ్యాధికి మందు లేదా టీకా కనుగొనేందుకు కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని, ఇందుకోసం సామాజిక దూరంతో పాటు.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఈ సంస్థ పిలుపునిచ్చింది.