విదేశాల్లో మగ్గుతున్న నల్లధనం వెలికి తీసే విషయంలో నూతన వ్యవస్థను రూపొందించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. నల్లధనాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన అన్ని రకాల చర్యలకు స్విస్ బ్యాంక్ పూర్తి స్థాయిలో భారత్కు సహకరిస్తోందన్నారు.
ఆదివారం ఆయన భారత్-స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రుల ద్వైపాక్షిక్ష భేటీలో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆ దేశ ఆర్థిక మంత్రి యులి మౌరర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ ఇక నుంచి స్విస్ బ్యాంకులో నగదు జమ చేసే వారి సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెలిసేలా నూతన వ్యవస్థ, నిబంధనలను తీసుకురానున్నట్లు వివరించారు. ఇందుకు ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.
కొత్త నిబంధనలు అమలులోకి వస్తే స్విస్ బ్యాంకులోని ఖాతాల్లో జమయ్యే సొమ్ము వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయన్నారు. అంతకుముందు స్విస్ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. నల్లధనం, పన్నులు తదితర అంశాల విషయంలో ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘ఇప్పటికే మేము భారత్కు పూర్తి సహకారం అందించేందుకు ముందుకు వచ్చాం. భవిష్యత్తులో దీనిని కొనసాగిస్తామన్నారు.