సినిమారంగం స్తబ్దుగా సాగిపోతున్న తరుణం అది. డాన్స్పరంగా, డైలాగ్ పరంగా ఒక ఒరవడిని అనుసరిస్తూ... బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి.. కలర్ సినిమాల వరకు పయనిస్తున్న సినీప్రస్థానం... ఒక్కసారిగా చలాకీగా, చురుకుగా నటనలో ఓనమాలు దిద్దుకుంటూ... డాన్స్పరంగా కుర్రకారుని హుషారెత్తి.. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడు... కొణిదెల శివశంకర వరప్రసాద్.. ఈ పేరు చాలా పొడుగుగా ఉండటంతో.. చిరంజీవిగా.. పేరు పునాదిరాళ్ళుతోనే పడింది. స్వతహాగా అంజనీదేవి కుమారుడిగా... ఆంజనేయ స్వామి భక్తుడుగా ఆ పేరును ఖాయం చేసేసుకున్నాడు. పట్టభద్రుడయ్యాక... నటన వైపు రావాలని ఆసక్తితో... మదరాసుచేరి... ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన వ్యక్తి చిరంజీవి. 1978లో 'పునాదిరాళ్ళు'లో నటించినా... ఆ చిత్రం విడుదల కాకముందే దాని తర్వాత చిత్రం 'ప్రాణం ఖరీదు' విడుదలైంది.
ఇక ఆర్టిస్టుగా ఉండాల్సిన అవగాహన, స్పార్క్ తొలి సినిమాకే వచ్చాయి. కృష్ణంరాజు, మురళీమోహన్ వంటివారితో కలిసి 'మన ఊరి పాండవులు' చిత్రం చిత్రీకరణంలో పొలం నుంచి వచ్చి కాళ్లు కడుక్కునే సీన్లో.. అందరూ ఒకేసారి పంపు దగ్గరకు రాగానే.. ఒకరి తర్వాత ఒకరు కాళ్లు కడుక్కునే సీన్లో.. మరొకరు ఖాళీగా ఉండటం బాగోదు కనుక.. ముందుగానే.. చిరంజీవి.. ఒంటికి అంటుకున్న మట్టిని దులుపుతూ... తన ముందువారు కాళ్లు కడుక్కునే వరకు ఏదో ఒకటి చేస్తూ.. నటిస్తూనే ఉన్నాడు. దర్శకుడికి అది బాగా నచ్చి... మెచ్చుకున్నారు. భవిష్యత్లో మంచి హీరో అవుతాడని దీవించారు.
సెంటిమెంట్..
చిన్నతనం నుంచి శంకర్కు సెంటిమెంట్ ఎక్కువ. తుల, కన్యారాశిలో పుట్టిన వారికి ప్రేమ, వాత్సల్యాలు ఎక్కువంటారు. అలా దాన్ని నిజం చేసేందుకు ప్రేమలు పంచేవాడు. ఇక తల్లిదండ్రులు కళాప్రియులే.. శంకర తల్లి అంజనాదేవి సినిమాలంటే ఇష్టం. తల్లి సినిమాలు ఎక్కువగా చూసేది. చిరంజీవి కూడా వెళ్లేవాడు. తండ్రి వెంకట్రావ్కు నాటకాల పిచ్చి. ఆయనకు ఎస్విఆర్ అంటే ఇష్టం. అయితే సినిమాల్లో వేషాలు వేయాలనుకున్నాడు కురదలేదు.
స్టేజీ నటుడుగా..
హైస్కూల్ డ్రామా కాంపిటేషన్లో 'పరధ్యానం పరందామయ్య' నాటికను చూడ్డానికి వెళ్ళి.. శంకర్.. అనుకోకుండా పరంధామయ్య పాత్రనే చేయాల్సి వచ్చింది. దానికి మొదటి బహుమతి కూడా లభించింది. ఇక కాలేజీలో కూడా ఇదే పిచ్చి. స్నేహితులు ఎక్కువ. ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఎలాగో పూర్తిచేసి నరసాపురంలో వై.ఎన్.ఎం. కాలేజీలో డిగ్రీ చేశాడు. బి.కామ్ చదివాడు.
సెలక్షన్.. టెన్షన్
మద్రాస్ మౌంట్రోడ్లో సఫైర్ థియేటర్లో ఫిలింఛాంబర్ ఉంది. అక్కడ ఆర్టిస్టుగా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. శంకరబాబు టెన్షన్గా ఉన్నాడు. లోపల డివిఎస్రాజు, దాసరి, పి.పుల్లయ్య. కె.విశ్వనాథ్.. ఇంటర్వ్యూ చేసేవారున్నారు. సొంతంగా ఒక డైలాగ్ చెప్పమంటే చెప్పేశాడు. ఆ తర్వాత.. 'పునాదిరాళ్ళు' చిత్రలో వేషం ఇచ్చారు. హీరోగా సుధాకర్.. స్నేహితుల్లో ఒకడిగా శంకరబాబు...
తొలిరోజు షూటింగ్లో జయసుధ, సత్యనారాయణ, చలం, రమాప్రభ, మాధవిలను చూసి హడలిపోయాడట. ఇక ఆ తర్వాత ప్రాణంఖరీదు సినిమా ప్రివ్యూకు కె.బాలచందర్, బాపు వచ్చారు. మనవూరి పాండవుల్లో చిరంజీవిని చూశాక ఇది కథకాదు చిత్రానికి యాంటీరోల్కు బాగుంటాడని అనుకున్నారు. అలా కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత మనవూరి పాండవులు.. శతదినోత్సవం చేసుకుంది. ఎక్కువగా నెగెటివ్ పాత్రలే వస్తుంటే చిరంజీవి మథనపడ్డాడు. కానీ ఏదైనా మెప్పించడమే అనుకుని చేసేవాడు.
జాతీయ అవార్డు..
1984లో వచ్చిన రాజ్యలక్ష్మీ వారి 'గూండా' చిత్రంలో వెల్తున్న రైలు అడుగు భాగాన పట్టుకుని వ్రేలాడటం మరో సంచలనం. 1985లో ఎస్పి.బాబు.. కాళిదాస్ కళానికేతన్ రజతోత్సవ సందర్భంగా నటభాస్కర్తో బిరుదుతో సత్కరించారు. 1987లో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరావు చిరంజీవితో స్వయంకృషి చేశారు. నంది అవార్డు వచ్చింది. 1988లో తమ్ముళ్లు నిర్మాతగా మారి.. అంజానా ప్రొడక్షన్స్లో రుద్రవీణ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి జాతీయపరంగా నర్గీస్దత్ అవార్డు వచ్చింది.
మరణమృదంగం చిత్రంలో నిర్మా కె.ఎస్. రామారావు.. తన పబ్లిసిటీతో మెగాస్టార్గా అభివర్ణించారు. 1988లో చిరంజీవికి ఆస్కార్ చలనచిత్రోత్సవాలకు ప్రతినిధిగా ఆహ్వానం వచ్చింది. 1989లో బావమరిది అల్లు అరవింద్.. పబ్లిషర్గా, విజయబాపినీడు సంపాదకునిగా చిరంజీవి పేరిట మాస పత్రిక ఆరంభమైంది. 1990లో 'ప్రతిబంధ్'తో బాలీవుడ్లోకి ప్రవేశం. 1991లో గ్యాంగ్లీడర్ విజయోత్సవ వేడుకలు.. ఒకేరోజు ఒకేసారి హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, తిరుపతిలోలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయబాపినీడు.. చిరంజీవికి స్వర్ణ కిరీటధారణ చేశారు. అదే యేడాది చిరంజీవి హైదరాబాద్కు తరలివచ్చారు.
మృత్యుంజయుడు..
1993లో చిరంజీవి కుటుంసభ్యులు మద్రాసు నుంచి హైదరాబాద్కు విమానంలో వస్తుంటే.. ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజున నెల్లూరు వెంకటగిరి పొలాల్లో పైలట్ భల్లా విమానాన్ని సురక్షింతంగా లాండ్ చేశాడు. అందులో శ్రీజ, అల్లు రామలిగయ్య, కనకరత్నం, చిరంజీవి ఉన్నారు. 1997లో 'మాస్టరు' చిత్రం కోసం 'తమ్ముడు.. అరె తమ్ముడు..' పాటను పాడారు. 1996లో వరదల వల్ల నష్టపోయిన పేదలను ఆదుకునేందుకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు.
1998లో ఐ అండ్ బ్లడ్బ్యాంక్ను అప్పటి సి.ఎం. చంద్రబాబు చేత ప్రారంభించారు.
మాహా మేధావి.. చిరంజీవి..
సినిమారంగంలో మాస్ చిత్రాల పేరుతో సెక్స్, హింస ఎక్కువై యువత పెడ ధోరణులకు మార్గంకాదా? అంటే? రామాయణంలో రావణాసురుడు ఏ సినిమా చూసి సీతను తీసుకెళ్ళి బంధించాడు? భారతంలో కీచకుడు ఏ చిత్రం చూసి ద్రౌవదిని రేప్ చెయ్యబోయాడు.. సో.. వీటిని బట్టి చూస్తే.. సెక్స్, వయొలెన్స్ అనేవి అనాది నుంచి వస్తున్నాయని అర్థమవుతుది.
అలాగే సత్యహరిశ్చంద ఏ సినిమా చూసి అబద్ధం ఆడటం మానేశాడు.. అలాగే భక్తపోతన చూసి ఓ హరిజన బాలుడు బాలయోగి అయ్యాడన్న నగ్నసత్యం తెలుసా? ఇలా చెప్పాలంటే.. చాలా ఉన్నాయి.. దేవదాసు చిత్రం చూసి మద్యం మానేసినవారు అక్కడక్కడా ఉన్నారు. మంచీచెడూ అనేవి ప్రతి మానవుడిలో ఉంటాయి. మానత్వం.. పశుత్వమూ... మనిషి తత్వాన్ని బట్టి బయటపడుతుంటాయి.. అనేవాడు..
150 సినిమాలు..
పునాదిరాళ్ళు నుంచి... నేటి ఖైదీ నెంబర్ 150 వరకు... 150 సినిమాలు పూర్తి చేస్తున్నాడని అనుకుంటున్నారు కానీ... అంతకుముందు.. మగధీర, బ్రూస్లీ చిత్రాల్లోనూ చిరంజీవి నటించారు. మరి ఆ చిత్రాలు లెక్కలోకి రావా? అని అడిగినవారు ఉన్నారు. అయితే అవి గెస్ట్ పాత్రలే కానీ ప్రముఖ పాత్రలు కావని... అందుకే.. వినాయక్కు 150 సినిమా అవుతుందని చిరంజీవి తరపున అల్లు అరవింద్ క్లారిటీ ఇస్తున్నారు.