తమను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారని టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ అన్నారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీని డాక్టర్ మోహన్ బాబు కుటుంబం కలిసింది. మోడీని కలవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? అని మీడియా ప్రశ్నించింది.
దీనికి మనోజ్ స్పందిస్తూ... రాజకీయాల్లోకి వచ్చి చేరమని నన్ను అడిగారు. నేను ఆలోచించి చెబుతాను అన్నాను అని ఆ వెంటనే ఓ నవ్వు నవ్వి "ఇట్స్ జస్ట్ జోకింగ్ అండీ" అంటూ, "ఆయనో గొప్ప నేత. మేం కలవగానే సాదరంగా ఆహ్వానించారు. బాగా మాట్లాడారు. వెడ్డింగ్ కార్డును చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు" అని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత మంచు విష్ణు మాట్లాడుతూ, తన సోదరుడు మనోజ్ వివాహం మే 20న జరుగనున్న నేపథ్యంలో మోడీని ఆహ్వానించేందుకు వచ్చామన్నారు. వీలైతే తప్పకుండా వస్తానని మోడీ తెలిపారని, ఆ సమయంలో చైనా పర్యటన ఉన్నట్టు తెలిసిందని వివరించారు.