తనలా ఎందరో పేకాడుతుంటారనీ, అలాంటిది నన్ను మాత్రమే పేకాడుతున్నానంటూ అదుపులోకి తీసుకున్నారనీ, నాతోపాటు ఇంకా పేకాట ఆడిన వారిని ఎందుకు వదిలేశారంటూ సినీ నటి కరాటే కళ్యాణి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రశ్నించారు. అసలు నన్ను అనవసరంగా పేకాట కేసులో ఇరికించారనీ, తాను గత ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలకు అంకితమైనట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ పేకాట ఆడటం తప్పయితే కోర్టు శిక్ష విధిస్తుందనీ, కానీ కొందరు తమకు తోచింది తోచినట్లు రాసేశారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
నేను పేకాట ఆడితే నాపై ఇతరత్రా అనుమానాలు వచ్చే విధంగా రాతలు రాయడం దారుణమంటూ మండిపడ్డారు. తనను పోలీసులు రాత్రి 9 గంటలకు అదుపులోకి తీసుకుంటే అర్థరాత్రి అని కొందరు రాశారంటూ ధ్వజమెత్తారు. కాగా నిన్న హైదరాబాదు నగరంలోని వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని జహంగీర్నగర్లో పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 11మందిని అరెస్ట్ చేసి రూ.77వేల నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 11 మందిలో సినీ నటి కళ్యాణి కూడా ఉన్నారు.