అల్లుఅర్జున్ హీరోగా నటించిన దేశముదురు చిత్రంలో ముద్దులొలికించే మోముతో అటు యువతరాన్ని... ఇటు దర్శక, నిర్మాతలను ఆకర్షించిన హీరోయిన్ హన్సిక. ఎంతో సున్నితమైన పాత్రలో దేశముదురు చిత్రంలో నటించిన ఈమెకు తొలి చిత్రంతోనే లక్కీ ఆఫర్లు వచ్చాయి.
ఆమె డేట్స్ ఇస్తే చాలు ఎంతైనా రెమెన్యురేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే తాను ప్రస్తుతం తెలుగు చిత్రాలు చేయదలుచుకోలేదని ఏడాది క్రితం స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకు కట్టుబడింది కూడా... ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కంత్రి చిత్రంలో నటిస్తోంది.
దేశముదురు చిత్రం తర్వాత హన్సిక ఈ గ్యాప్లో బాలీవుడ్లో హిమేష్ రేషమ్మియా హీరోగా నటించిన ఆప్ కా సురూర్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత యమదొంగ చిత్రంతో ఒళ్లు తగ్గించిన ఎన్టీఆర్ ఆమె పర్సనాలిటీకి సూటవుతాడని భావించి దర్శకుడు మెహర్ రమేష్ హన్సికను ఒప్పించాడు.
మీరు కంటిన్యూగా తెలుగులో చిత్రాలు చేస్తే అందుకు తాము సిద్ధమంటూ ముగ్గురు అగ్రనిర్మాతలు ఇప్పటికే ఆమెకి బ్లాంక్ చెక్కులు అందజేయటం గమనార్హం. దీంతో ఒక చిత్రానికి కోటి రూపాయలు వసూలు చేస్తున్న పోకిరి ఫేమ్ ఇలియానాకు హన్సిక పోటీ కానుంది. ఎందుకంటే అత్యధిక రెమెన్యురేషన్ పుచ్చుకోవడంలో ఇలియానాను.. హన్సిక మించిపోతోందని ఫిలిం నగర్ వర్గాలు కోడైకూస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. పూరి జగన్నాథ్ శిష్యుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న కంత్రీ చిత్రం సి. అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతోంది.