స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాక ఇమేజ్ను కాపాడుకోవడం చాలా కష్టమైన పని. ఆదితో మాస్ ఇమేజ్ను పెంచుకుని సింహాద్రి చిత్రంలో ఇంకాస్త పీక్ స్టేజీకి వెళ్లిన ఎన్టిఆర్ జూనియర్కు.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మిశ్రమ స్పందన కల్గించాయి. అదుర్స్ ఆడినా ఆ తర్వాత అంతగా ఆడిన సినిమాలు లేవు. ప్రస్తుతం తన కెరీర్ను సినిమాల వైపే చూసుకుంటున్నాడు.
రాజకీయాల్లోనూ చంద్రబాబు తనను రానీయకపోవడంతో కాస్త కలత చెందాడనే వార్తలు విన్పించాయి. ప్రస్తుతం సినిమా సక్సెస్ కోసం పరితపిస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'రభస' చిత్రం సక్సెస్ను ఇస్తుందని ధీమాతో ఉన్నాడు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కూడా ఆ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు.
ఒకటికి రెండుసార్లు ఆ చిత్ర కథను కూడా మార్చి సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ కీలకంగా చిత్రాన్ని మలచడానికి ప్రయత్నించారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. ఈ నెల 20న చిత్రం ఫస్ట్లుక్ను విడుదల చేయబోతున్నారు. సినిమా ఎలా ఉంటుందనేది ముందుగా రుచి చూపించేదుకు ఇది ఉపయోగపడుతుంది. దీంతో బిజినెస్ క్రేజ్ కూడా వస్తుందని ఆశిస్తున్నారు.