ప్రముఖ హాస్యనటుడు పి. పద్మనాభంకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వర్ణకంకణాన్ని తొడిగారు. పద్మశ్రీ డాక్టర్. అల్లురామలింగయ్య పేరిట జాతీయస్థాయి అవార్డును పద్మశ్రీ డా. అల్లురామలింగయ్య కళాపీఠం నిర్వహించింది.
గురువారం జూబ్లిహిల్స్లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మడి, కె. రాఘవేంద్రారావు, అల్లు అర్డున్ రామ్చరణ్తేజ, సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తన కెరీర్కు ముగ్గురు వ్యక్తులు కీలకమన్నారు. అందులో తాత ఒకరు. ఆయనపేరిట గల అవార్డు.. ఆయన సమకాలీనుకి దక్కడం గౌరవంగా భావిస్తున్నామన్నారు.
ఈ గౌరవ సత్కారాన్ని అందుకున్న పద్మనాభం మట్లాడుతూ.. మనిషి ఏడుస్తూ పుడతాడు. ఏడుస్తూ మరణిస్తాడు. ఈ మధ్యనుండే జీవితాన్ని మనిషి నవ్వు తూ బతకాలి. నటుడిగా ఆ నవ్వును నలుగురికి పంచే అవకాశం తనకు రావడం వరమన్నారు. ఈ సందర్భంగా "నావూరు మదరాసు.. నా పేరు రామదాసు.." అనే పాట పాడి సభికులను అలరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న "మగధీర" హీరో రామ్చరణ్ తేజ మాట్లాడుతూ.. తాతయ్య అందరి సినిమాలు చూశారు. నా సినిమా చూడకుండా వెళ్లిపోయాడు. ఇది తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఈ అవార్డును పద్మనాభంకు అందజేయడం సముచితమన్నారు.
అల్లుఅరవింద్, అల్లు అర్జున్, గుమ్మడి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి చిరంజీవి అభిమానులు భారీగా తరలివచ్చారు. కానీ మెగస్టార్ అస్వస్థత కారణంగా రాకపోవడంతో వారు నిరాశకు గురైయ్యారు.