నంది అవార్డుల గొప్పతనమేమిటని ప్రముఖ విప్లవ కథానాయకుడు ఆర్.నారాయణ మూర్తి ప్రశ్నించారు. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలకు ఈ అవార్డులు దక్కవని, పైరవీ చేసి నిర్మాతలకే ఈ అవార్డులను ప్రకటిస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లో జరిగిన ఓ సినీ అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రంలో ఆయన పాల్గొని ఘాటుగానే విమర్శలు గుప్పించారు. తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై ఆయన విమర్శలు గుప్పించారు. ఉత్తమ చిత్రం గమ్యం. దానికో నమస్కారం. ద్వితీయ చిత్రం వినాయకుడు.. దీనికో రెండు నమస్కారాలు. ఉత్తమ తృతీయ చిత్రం పరుగు.. దీనికో మూడు నమస్కారాలు. ఇలాంటి చిత్రాలకు అవార్డులపై అవార్డులు వస్తుంటాయన్నారు.
కానీ, నిత్యం మన కళ్లముందు జరిగే సంఘటనలను కథాంశంగా చేసుకుని మాబోటి కళాకారులు నిర్మించే చిత్రాలకు మాత్రం ఇవి దక్కవు. అసలు తమను గుర్తించే వారు ఎవరున్నారని అన్నారు. అటువంటపుడు ఈ అవార్డులు ఎందుకని, అసలు ఈ అవార్డుల్లో ఏమిటి గొప్పతనమని నారాయణ మూర్తి ప్రశ్నించారు.