ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ సోదరుడు, లెటరింగ్ ఆర్టిస్ట్, పబ్లిసిటీ డిజైనర్ కె.బ్రహ్మానందరావు(67) శనివారం కన్నుమూశారు. ఆరుగురు సోదరుల్లో చివరి వారైన బ్రహ్మానందరావు 'బ్రహ్మం'గా అందరికి సుపరిచితులు. పాలకొల్లులో జన్మించిన ఆయన చెన్నై వెళ్ళి తన సోదరుడు ఈశ్వర్ వద్ద ఛీఫ్ అసిస్టెంట్గా చేరారు.
లెటరింగ్ ఆర్టిస్ట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బ్రహ్మం కొన్నివేల చిత్రాలకు లోగోలు రాశారు. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఉపయోగిస్తున్న తెలుగు, తమిళ, కన్నడ ఫాంట్స్ని బ్రహ్మం రూపొందించి 'అక్షరబ్రహ్మ'గా పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం వివిధ పత్రికల్లో కనిపిస్తున్న ఫాంట్స్ ఆయన క్రియేట్ చేసినవే. ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమ, పబ్లిసిటీ డిజైనర్స్ తమ సంతాపాన్ని తెలియజేశారు.