ఎస్.వి.కృష్ణారెడ్డితో పలు చిత్రాలను నిర్మించిన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ ఈసారి రవితేజ, ఇలియానా జంటగా ఓ కొత్త చిత్రానికి దసరానాడు శ్రీకారం చుట్టింది. వెంకట్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
రామానాయుడు స్టూడియోలో రవితేజ, ఇలియానాలపై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. దీనికి మోహన్ బాబు క్లాప్ కొట్టగా, వెంకటేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. పూరీ జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. దిల్రాజు పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
కథా రచయిత వక్కంతం వంశీ చిత్రం గురించి చెబుతూ.. సురేందర్ రెడ్డితో అశోక్ తర్వాత చేస్తున్న చిత్రమిదని, రవితేజ బాడీ లాంగ్వేజ్కు సరిపడా కథాంశంతో ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందన్నారు.
రవితేజ వ్యాఖ్యానిస్తూ... ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో ఇలియానాతో తాను చేసే రెండో సినిమా అని గుర్తు చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రమిదన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... నవంబర్ పది నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, విదేశాల్లో 60శాతం షూటింగ్ను జరుపనున్నట్లు తెలిపారు. అభిమాన సహ నటుడితోపాటు సీనియర్ టెక్నీషియన్స్తో నటించడం చాలా ఆనందంగా ఉందని నటి ఇలాయానా వెల్లడించింది.
WD
మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ... సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడు నవ్వేంత వినోదభరితంగా తీర్చిదిద్దుతున్నామని, మంచి కథను వంశీ అందించారని వెల్లడించారు. దానికి సరైన సంభాషణలు రాసి నవ్వించాలని, అలా నవ్వించకపోతే అది తన తప్పేనని అబ్బూరి తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో తమిళ నటుడు శ్యామ్, అషీకా, సునీల్, బ్రహ్మానందం, ధర్మవరపు, కోట, షాయాజీ షిండే, అలీ, రఘుబాబు, జీవా, బెనర్జీ, దువ్వాసి మోహన్ తదితరులు ఎంపికయ్యారు.