తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శంఖారావం పూరించింది. ఇందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయనున్నారు.
సోమవారం పంచమి తిథి కావడంతో ఇదే శుభముహూర్తంగా అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులూ చేయలేదని, కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు తెలిపారు.
నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలకు భారాస అభ్యర్థులను ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఉప్పల్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, వేములవాడ సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి బరిలోకి దిగనున్నారు.