తెలంగాణ రాష్ట ఫైర్బ్రాండ్, టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. ప్రభుత్వం నుంచి బెదిరింపులు రావడంతో ప్రాణహాని పొంచివున్నట్టు భావిస్తున్నారు. దీంతో తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వం తరపున భద్రత కల్పించాలంటూ ఆయన శుక్రవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన అనేక సంచలన అంశాలను ప్రస్తావించారు.
ఇటీవలి కాలంతో తనకు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తరచుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్లే ప్రమాదం పొంచివున్నట్టు తాను భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గాని, రాష్ట్ర పోలీసు శాఖపై గాని నమ్మకం లేదన్నారు.
అందువల్ల తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రత కల్పించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి పిటిషన్పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా, తెరాస అధినేత కేసీఆర్పైనా, ఆయన ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు కురిపిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా.. కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేల్చుతుంటారు. పైగా, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు అయిన విడుదలయ్యారు. ఈ సమయంలో కార్యకర్తలనుద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో వ్యక్తిగత విమర్శలు కూడా ఉన్న విషయం తెల్సిందే.