తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో అధికార తెరాసను ఇరుకున పెడుతూ పార్టీ ఎమ్మెల్యేల భరతం పట్టేలా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగిపోతున్నాయి. ఇందులోభాగంగా, రాజ్యసభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టినట్టయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించవచ్చని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య మైత్రీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అదేవిధంగా త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఉమ్మడిగానే ముందుకు సాగాలని భావిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్, టీడీపీల ఎత్తుగడలను చిత్తు చేసి.. తమ పార్టీలో చేరిన కాంగ్రెస్, టీ టీడీపీ ఎమ్మెల్యేల బలంతో మరో అభ్యర్థిని అండగా గెలిపించుకునేలా తేరాస నేతలు ఎత్తులు వేస్తున్నారు.