కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై జరుగుతున్న చర్చలో భాగంగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన తొలి ప్రసంగాన్ని సభలో వినిపించారు. భారీ మెజారిటీ ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సంస్కరణలను ప్రతిపాదించలేకపోయిందని విమర్శించారు.
ముఖ్యంగా.. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ఆర్థిక సహాయం అందజేయటంలోనూ, దిశ చూపించటంలో కేంద్రం విఫలమైందన్నారు. తెలంగాణకు కొత్త రైళ్లు ఇవ్వలేదు, ప్రాజెక్టులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ధనికులపై ఎక్కువ పన్నులు విధించి పేద ప్రజలపై తక్కువ పన్నులు వసూలు చేయాలని కవిత సూచించారు.
లోక్సభలో గురువారం ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె, దేశంలోని ధనమంతా కొందరు వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమవుతోందని అన్నారు. ఎన్డిఏ బడ్జెట్కు గతంలో యుపిఏ ప్రతిపాదించిన బడ్జెట్లకు ఎలాంటి తేడా లేదని ఆమె అన్నారు. యుపిఏ ప్రభుత్వం ఉత్పాదక రంగానికి అన్యాయం చేసిందని ఎన్నికల ప్రచారంలో ఆరోపించిన మీరు ఉత్పాదక రంగానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదని కవిత నిలదీశారు.