దేశంలో హైదరాబాద్ను మించిన నగరం లేదనీ, అందుకే ప్రముఖ ఐటీ దిగ్గజం యాపిల్ కంపెనీ ఇక్కడకు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలికి దగ్గరలోని నానక్ రామ్ గూడలో యాపిల్ సంస్థ ఏర్పాటుచేసిన అభివృద్ధి సెంటర్ను ప్రారంభించింది. ఆతర్వాత ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్తో సమావేశమయ్యారు.
ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికలో తెరాస విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. యాపిల్ వంటి ప్రసిద్ధ కంపెనీలు హైదరాబాద్కి వచ్చేలా చేస్తున్నామని, అయినా కూడా ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న పనులను విమర్శిస్తూనే ఉన్నాయన్నారు.
యాపిల్ సంస్థ యూరప్ దేశాలన్నింటినీ పరిశీలించిందని, భారత్లోని ఇతర రాష్ట్రాలను కూడా పరిశీలించిందని చివరికి తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ను ఎంచుకుందని గుర్తు చేశారు. అలాగే, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలయిన అమెజాన్, గూగుల్, యాపిల్, ఫేస్ బుక్ ఈ నాలుగు కంపెనీలు హైదరాబాద్కి వచ్చేశాయని, ఇంతటి ఘనతను సాధిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం పట్ల తమ ఉద్దేశమేమిటని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.