ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత ఏస్ షెట్లర్... తెలుగు తేజం పీవీ సింధు మ్యాచ్లో చేసిన చిన్నపాటి తప్పిదాల కారణంగా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్లో అద్భుతంగా ఆడి అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీ ఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది.
47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు తీవ్ర ఒత్తిడికి లోనయ్యి 15 పాయింట్లను నెట్ వద్ద సమర్పించుకుంది. ఆమె కొట్టిన చాలా షాట్లు నెట్కు తగిలాయి. శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 17-21, 15-21తో ప్రపంచ 10వ ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండో ఏడాది కూడా ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో కాంస్యం పతకాన్ని సింధు గెలుచుకుంది.