పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉంది నాందేడ్. నాందేడ్ నందులు పరిపాలించారని అంటారు. మరఠ్వాడా ప్రాంతంలో రెండో అతిపెద్ద నగరం నాందేడ్. సిక్కులకు ఇది పవిత్ర ప్రదేశం. వనవాస కాలంలో శ్రీరాముడు ఇక్కడ కొన్నాళ్లు గడిపారని అంటారు. మహారుషి వాల్మీకి, మహాకవి కాళిదాసు, భవభూతి వంటివారు తమ రచనల్లో నాందేడ్ గురించి ప్రస్తావించారు. విదేశీ పర్యాటకుడు టోలమీ తన గ్రంధంలో సైతం నాందేడ్ ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లిందని వివరించారు.
నాందేడ్ గురించి పురాణాలలో ప్రస్తావించటం జరిగింది. పాండవులు ఈ ప్రాంతంలో సంచరించారని అంటారు. నాందేడ్కు పూర్వ నామధేయం నందితత్. శాతవాహనుల ప్రాంతంలోనిది నాందేడ్ అని చరిత్రకారులు పేర్కొన్నారు. చాళుక్య వంశ రాజు నందదేవుడు నాందేడ్ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులతో పాటుదా దేవగిరి యాదవ రాజులు నాందేడ్ను తమ రాజ్యంలో భాగంగా అభివృద్ధి చేశారు. బహమనీ సుల్తానుల కాలంలో తెలంగాణా సుభా కింద నాందేడ్ ఉండేది.
మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబు కాలంలో సిక్కు మత గురువు గురు గోబింద్ సింగ్ నాందేడ్ సందర్శించారని అంటారు. గురు గోబింద్ సింగ్ తన ప్రాణాలను ఇక్కడే వదలటంతో సిక్కులు పవిత్ర గురుద్వారాను ఏర్పాటుచేసుకున్నారు. ఈ గురుద్వారా నిర్మాణానికి మహారాణా రంజిత్ సింగ్ ఆర్ధిక సాయం అందించారు.
చూడవలసిన ప్రాంతాలు
గురుద్వారా తఖ్త్ సచ్ఖండ్గా పిలిచే ఈ గురుద్వారాను మహారాణా రంజిత్ సింగ్ కట్టించారు. ఈ గురుద్వారా నిర్మాణం 1835లో పూర్తైంది. సిక్కుల పవిత్ర నాలుగు గురుద్వారాలలో నాందేడ్ గురుద్వారా ఒకటి. సిక్కుల పదవ మత గురువు గోబింద్ సింగ్. ఆయన సమాధే ఈ గురుద్వారా. గురు గోబింద్ సింగ్ వాడిన ఆయుధాలు, ఇతరాలను ఇక్కడ ఉంచారు.
మాహూర్ శ్రీ మహావిష్ణువు సోదరి పార్వతీ అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటి మాహూర్యం. వైకుంఠ నాథుడైన శ్రీమన్నారాయణ అవతారాల్లో ఒకటైన పరుశురాముడి జనని రేణుకా. రేణుకా దేవి ఇక్కడే జన్మించిందని పురాణాల్లో ప్రస్తావించారు. రేణుకా అమ్మవారి గుడిని యాదవ వంశ రాజు నిర్మించారు. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. నాందేడ్ నుంచి 126 కి.మీ., నాగపూర్ నుంచి 250 కి.మీ. దూరంలో ఉంది మాహూర్.
నాందేడ్ కోట గోదావరి నది ఒడ్డున ఉంది నాందేడ్ కోట. నాందేడ్ కోటకు మూడువైపులా గోదావరి నది ఉంది.
వసతి నాందేడ్లో అన్నిరకాల వసతి సదుపాయాలు ఉన్నాయి.
విమాన మార్గం : హైదరాబాద్ (284 కి.మీ.) సమీపంలోని విమానాశ్రయం. రైలు మార్గం : సికింద్రాబాద్-మన్మాడ్ మార్గంలో ఉంది నాందేడ్ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి ముంబయి, నాగపూర్, న్యూఢిల్లీ, సికింద్రాబాద్, బెంగళూరులకు నేరుగా రైళ్లు ఉన్నాయి. రహదారి మార్గం : మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్లలోని వివిధ ప్రాంతాల నుంచి నాందేడ్కు బస్సు సేవలు ఉన్నాయి.