Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసము ప్రారంభం, ఏమేమి చేయాలి?

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (10:37 IST)
కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది. తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానాన్ని చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతినీ మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం...ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీకమాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీకస్నానం, ఉపవాసము, కార్తీకదీపము.

 
కార్తీకస్నానం :
కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి అందుబాటులేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినాసరే, తలస్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.

 
ఈ విధంగా నియమంతో స్నానంచేసి శివుడినిగాని, విష్ణవునుగాని, లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కరతీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు నశించి పుణ్యఫలితాలు అందుతాయి.

 
కార్తీకమాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే 'నక్తమ్' అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేనివారు పాలవంటి ద్రవపదార్థాన్నిగాని, పండువంటి ఘనపదార్థాన్నిగాని స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకుని, దీపారాధన చేసుకుని భోజనం చేయాలి.

 
దీపారాధన :
కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహామహిమోపేతమైనది. శివాలయంలోగాని, ఇంట్లోనైనాసరే ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనాసరే, తెలిసిగాని, తెలియకగాని, ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది. జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి. కార్తీకదీప దానంవల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము.

 
దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు గాని, అన్నదానముగాని, శయ్య (మంచం) దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటేగాక, మంగళప్రదము సౌభాగ్యకరముగా చెప్పబడినది. సూర్యాస్తమయం అయిన వేంటనే సంధ్యాదీపం వెలిగించుట ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగును.

 
కార్తీకమాసములో కొన్ని వస్తువులు నిషేధించడమైనది. అవి వాడరాదు. ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడి కాయ, తీయగుమ్మడి, నువ్వులు నిషిద్ధముగా చెప్పబడినవి. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటిపూట ఆవుపేడతో అలికి, పద్మములతో ముగ్గులు పెట్టి, రంగు రంగుల రంగవల్లిపై కార్తీకదీపం పెట్టి, కార్తీక పూరాణము చదివిన వారికి, వినినవారికి ఏడు జన్మలవరకూ వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెపుతున్నది.

 
ధాత్రీపూజ :
ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments