ఒకసారి సీతమ్మ తల్లి నుదుటనే సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయస్వామి. అమ్మా దేనికమ్మా సింధూరం ధరిస్తున్నావు? అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు అమ్మవారికి. సింధూరం ధరించడం వలన శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అని చెప్పింది.
ఇందులో శ్రీరామచంద్రునకు మేలు జరుగుతుంది అనే మాట ఆంజనేయస్వామి మనస్సులో నాటుకుపోయింది. వెంటనే ఆంజనేయస్వామని శరీరమంతా సింధూరం పూసుకుని సభకు వెళ్ళాడు. అది చూసిన సభాసదులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయస్వామిని దగ్గరకు పిలిచి విషయం అడిగాడు. స్వామి జరిగిన విషయం చెప్పాడు. శ్రీరాముడు ఆంజనేయస్వామికి తన పట్ల భక్తికి సంతసించాడు. వెంటనే ఒక వరం కూడా ఇచ్చాడు.
హనుమా ! మంగళవారం నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల అభీష్టాలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. భక్త జనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయస్వామి. అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు.