ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఎన్.ఆర్.ఐలు భాగస్వాములు కావాలని మాజీమంత్రి, తెలుగుదేశం నాయకురాలు గల్లా అరుణకుమారి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె 21 జూన్ ఆదివార బే ఏరియా ఫ్రీమోంట్ నగరంలో ఎన్ఆర్ఐ తెదేపా ఆధ్వర్యంలో 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు యువతకు, టెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా పరిశ్రమలు స్థాపించేవారికి త్వరితగతిన అనుమతులు మరియు ప్రోత్సహకాలు ప్రకటించిందని వాటిని ఎన్ఆర్ఐలు ఉపయోగించుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటుందని అన్నారు. రాజధాని నిర్మాణంలో తన కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఉండటం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా డా. రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని సమాజ సేవకోసం వినియోగించాలన్నారు. గ్రామ ప్రజల స్కిల్ డెవలప్మెంట్ కోసం అందరూ సహకరించి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. చంద్రగిరి తెదేపా నాయకులు నీలకంట చౌదరి మాట్లాడుతూ... అమెరికాలో ఉన్నప్పటికీ ఇక్కడి తెలుగు ప్రజలు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.