భారత జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు షికాగో తెలుగు అసోసియేషన్ (సీటీఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇల్లినాయిస్లోని ఎవాన్స్టన్లో అక్టోబర్ 3వ తేదీన బాపూజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సీటీఏ పేర్కొంది.
ఈ విషయమై సీటీఏ అధ్యక్షుడు రావు అచంట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... 2424 లేక్స్ట్రీట్లో ఎమ్ఎల్ కింగ్ లాబ్ పాఠశాలలో మహాత్ముడి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసిన తరువాత చిన్నారులకు వ్యాస రచన పోటీలను పెట్టనున్నట్లు ఆయన చెప్పారు.
ఆ తరువాత రక్తదానం కార్యక్రమం నిర్వహిస్తామనీ.. ఉత్సవాల్లో భాగంగా గాంధీజీపై నిర్మించిన డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనున్నామని రావు అచంట పేర్కొన్నారు. ఈ మేరకు చికాగోలోని ప్రవాస భారతీయులందరూ బాపూజీ జన్మదిన వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాలని సీటీఏ ఆహ్వానించింది. కాగా.. సీటీఏ మొట్టమొదటిసారిగా గాంధీ జయంతిని నిర్వహించనుండటం గమనార్హం.