ఆస్ట్రేలియాలో మూడు నెలల క్రితం జాత్యహంకార దాడికి గురైన తొలి భారతీయ విద్యార్థి శ్రావణ్ కుమార్ను భారత విదేశాంగమంత్రి ఎస్.ఎం. కృష్ణ పరామర్శించారు. ఆ దేశంలో తన ఐదురోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం రోజున కృష్ణ, శ్రావణ్ ఇంటికి వెళ్లి, అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేగాకుండా, వ్యక్తిగత సాయంగా లక్ష రూపాయలను అందజేశారు.
పావుగంటసేపు శ్రావణ్ కుటుంబంతో గడిపిన కృష్ణతో.. శ్రావణ్ తండ్రి చిదంబరరావు మాట్లాడుతూ... తమ కుమారుడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని పేర్కొన్నారు. అయితే శ్రావణ్ కోలుకునేందుకు భారత ప్రభుత్వం తమకు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆసుపత్రి ఖర్చులయితే ఆసీస్, భారత్ ప్రభుత్వాలూ రెండు భరిస్తున్నాయని చిదంబరరావు వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున కృష్ణ శ్రావణ్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. కాగా.. అంతకుమునుపు కృష్ణ, విక్టోరియా రాష్ట్ర ప్రధాని జాన్ బ్రూమ్బేను కలిసి, భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల గురించి చర్చించారు. అనంతరం సీనియర్ పోలీసు అధికారులతోపాటు ఆయన, నేరాలు ఎక్కువగా జరిగే రాష్ట్ర పశ్చిమ శివారు ప్రాంతాలలో పర్యటించారు.